అజ్ఞాతవాసి పరాజయంతో త్రివిక్రమ్ కాన్ఫిడెన్స్తో పాటు ఈగో కూడా బాగా దెబ్బతింది. రచయితగా, దర్శకుడిగా తనకి మాయని మచ్చగా మిగిలిపోయిన ఆ చిత్రం పరాభవం నుంచి తేరుకుని ప్రస్తుతం ఎన్టీఆర్తో 'అరవింద సమేత' చేస్తున్నాడు. అజ్ఞాతవాసి కంటే ముందే కమిట్ అవడం వల్ల ఈ చిత్రాన్ని చేస్తున్నాడు కానీ కొంతకాలం స్టార్ హీరోలకి దూరంగా వుండాలని త్రివిక్రమ్ డిసైడయ్యాడు.
యువ హీరోలతో తనకి నచ్చిన కథలతో సినిమాలు చేయాలని, ఫలానా హీరో ఇమేజ్కి అనుగుణంగా సినిమాలు తీయడం తగ్గించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే 'అరవింద సమేత' తర్వాతి చిత్రాన్ని నాని హీరోగా త్రివిక్రమ్ చేయబోతున్నాడు. మిడిల్ రేంజ్లో ఇంకా చాలా మంది టాలెంటెండ్ హీరోలు వుండడంతో వారితో వరుసగా కొత్త రకం కథలని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడు.
మధ్యమధ్యలో స్టార్ హీరోలతో చేసినా కానీ ఇక మీదట కేవలం స్టార్లకే పరిమితం కాకూడదని, దాని వల్ల తన ఆలోచనలు, సినిమాలు కూడా పరిమితం అయిపోతున్నాయని ఆయన భావిస్తున్నాడు. త్రివిక్రమ్ స్థాయి దర్శకుడు పంథా మార్చి యువకులతో పని చేస్తే మరింత మంది టాప్ రేటెడ్ డైరెక్టర్లు ఈ రూట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనుక ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే.