అన్నీ చెప్పి అసలు మేటర్ దాచిన ‘ఖుషి’ నిర్మాత

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమా ఇప్పటికే రీ-రిలీజ్ అయింది. ఇప్పుడు ఖుషి సినిమా వంతు వచ్చింది. పవన్…

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమా ఇప్పటికే రీ-రిలీజ్ అయింది. ఇప్పుడు ఖుషి సినిమా వంతు వచ్చింది. పవన్ కెరీర్ లో తొలి ప్రేమ తర్వాత, కల్ట్ మూవీగా నిలిచిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో బాగా హంగామా నడుస్తోంది. 

డిసెంబర్ 31న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రత్యేకంగా మాట్లాడారు నిర్మాత ఏఎం రత్నం. సినిమా విశేషాలు, కొన్ని సైడ్ లైట్స్ తో పాటు పవన్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇలా అన్నీ చెప్పిన రత్నం, ఓ విషయాన్ని మాత్రం మరిచిపోయారు. ఖుషి సినిమాలో నిజానికి మొదట అనుకున్న హీరోయిన్ భూమిక కాదు. 

ఖుషి సినిమా అసలు పేరు 'చెప్పాలని ఉంది'. ఇదే పేరుతో క్లాప్ బోర్డ్ కొట్టారు. కానీ ఆ టైమ్ లో క్లాప్ బోర్డ్ వెనక భూమిక లేదు. అక్కడున్నది హీరోయిన్ అమీషా పటేల్. అవును.. పవన్-అమీషా హీరోహీరోయిన్లుగా, ఎస్ జే సూర్య దర్శకత్వంలో చెప్పాలని ఉంది అనే ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. తొలి సన్నివేశంగా 'నడుము సీన్' నే తీశారు. 

ఆ షాట్ చూసి అక్కడే ఉన్న అప్పటి మంత్రి దేవేందర్ గౌడ్, హీరో వెంకటేష్, పవన్ కల్యాణ్ తండ్రి చప్పట్లు కూడా కొట్టారు. ఇంత తతంగం నడిచింది అక్కడ. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు అమీషాను తప్పించారు, ఆ స్థానంలో భూమిక వచ్చింది. పనిలోపనిగా టైటిల్ కూడా మారింది. 

చెప్పాలని ఉంది అనే టైటిల్ ను ఖుషీగా మార్చింది పవన్ కల్యాణే. మరి అమీషాను మార్చి భూమికను తీసుకోవాలనుకున్న నిర్ణయం ఎవరిదో!