భార్య‌ను హింసించిన న‌టుడి అరెస్ట్‌

భార్య‌ను హింసించి, ఆత్మ‌హ‌త్య‌కు ఉసిగొల్పిన కేసులో ద‌క్షిణాది ప్ర‌ముఖ న‌టుడు దివంగ‌త రాజ‌న్ పి దేవ‌న్ కుమారుడైన న‌టుడు ఉన్ని రాజ‌న్ అరెస్ట్ అయ్యాడు. మలయాళ నటుడు రాజన్ పి దేవ్.. ఆది, దిల్,…

భార్య‌ను హింసించి, ఆత్మ‌హ‌త్య‌కు ఉసిగొల్పిన కేసులో ద‌క్షిణాది ప్ర‌ముఖ న‌టుడు దివంగ‌త రాజ‌న్ పి దేవ‌న్ కుమారుడైన న‌టుడు ఉన్ని రాజ‌న్ అరెస్ట్ అయ్యాడు. మలయాళ నటుడు రాజన్ పి దేవ్.. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ త‌దిత‌ర‌ సినిమా లతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం. 200 సినిమాలకు పైనే నటించారాయ‌న‌. 2009లో లివర్ సంబంధిత అనారోగ్యంతో చనిపోయారు.

రాజన్ పి దేవ్ కొడుకు ఉన్ని రాజన్ కూడా న‌టుడే. కమెడియన్గా, విలన్గా దాదాపు 30 మలయాళ చిత్రాల్లో నటించాడు. 2019లో ఉన్నికి ప్రియాంక అనే టీచ‌ర్‌తో వివాహం జరిగింది. 

తండ్రి చనిపోయాక అత‌ను జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో డ‌బ్బు కోసం భార్య ప్రియాంక‌ను కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వేధించ‌డం మొద‌లు పెట్టాడు. ఒక రోజు భార్య‌తో గొడ‌వ ప‌డుతున్న స‌మ‌యంలో ప్రియాంక త‌ల్లి అడ్డు వెళ్లింది. ఆ స‌మ‌యంలో త‌న‌పై కూడా దాడి చేసిన‌ట్టు ప్రియాంక త‌ల్లి ఆరోపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 11న ఉన్ని ఇంట్లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ప్రియాంక వెంట‌నే పుట్టింటికి వెళ్లింది. ఆ మ‌రుస‌టి రోజు ఆమె ఉరికి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందింది. ఇదిలా ఉండ‌గా ఆత్మ‌హ‌త్య‌కు ముందు భ‌ర్త వేధింపుల‌పై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం. 

ఘ‌ట‌న త‌ర్వాత వెంట‌నే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసువాల్సింది. అయితే క‌రోనా పాజిటివ్‌తో బాధ‌ప‌డుతున్న కార‌ణంగా అరెస్ట్ చేయ‌లేదు. ఇప్పుడు నెగెటివ్ రిపోర్ట్ రావ‌డంతో పోలీసులు అరెస్ట్ చేసి క‌ట‌క‌టాల వెన‌క్కి పంపారు. టాలీవుడ్‌కి సుప‌రిచితుడైన న‌టుడి కుమారుడు కావ‌డంతో ఉన్నిరాజన్ అరెస్ట్ ప్రాధాన్యం సంత‌రించుకుంది.