దర్శకుడిపై సైబర్ కేసు!

దర్శకుడు రాజసింహ తాడినాడ మీద సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసారు నిర్మాత వివేక్ కూచిభొట్ల. గతంలో ఈ దర్శకుడు సందీప్ కిషన్-నిత్యామీనన్ లతో ఒక సినిమా చేసారు. ఆయన ఇటీవల ఫేస్ బుక్ లో…

దర్శకుడు రాజసింహ తాడినాడ మీద సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసారు నిర్మాత వివేక్ కూచిభొట్ల. గతంలో ఈ దర్శకుడు సందీప్ కిషన్-నిత్యామీనన్ లతో ఒక సినిమా చేసారు. ఆయన ఇటీవల ఫేస్ బుక్ లో వివేక్ కూచిభొట్ల మీద వివాదాస్పద పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే దర్శకుడు విఎన్ ఆదిత్య మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ కూచిభొట్ల సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసారు.

గతంలో తనకు కొన్ని కథలు చెప్పారని, అప్పటి నుంచి తన వైపు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆశిస్తూ, మెసేజ్ లతో వేధిస్తూ వస్తున్నారని తెలిపారు. అక్కడితో ఆగకుండా ఫేస్ బుక్ లో తన పరువు తీసే విధంగా పోస్ట్ లు పెడుతున్నారని తెలిపారు.

కాంబినేషన్ లు సెట్ చేసి సినిమాలు తీసేవారు నిర్మాత కాదు, బ్రోకర్ అని పేర్కొంటూ, తన ఫొటో పోస్ట్ చేసి కామెంట్ లు పెట్టారని వెల్లడించారు. అలాగే తమ సంస్థతో అనుబంధం వున్న విఎన్ ఆదిత్య మీద కూడా ఇలాంటి పోస్ట్ లు పెట్టారని, ఆయన కూడా వేరే ఫిర్యాదు చేసారని వివేక్ వెల్లడించారు.

వివేక్ ఫిర్యాదు చేసిన అనంతరం రాజసింహ ఫేస్ బుక్ నుంచి తన పోస్ట్ లు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫోన్ స్విచాఫ్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, రాజసింహను విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.