తొంద‌ర‌ప‌డ్డ క‌మ‌ల్‌హాస‌న్‌… ట్వీట్ తొల‌గింపు!

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ కాస్త తొంద‌ర‌ప‌డ్డారు. ప్రముఖ న‌టుడు శ‌ర‌త్‌బాబు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. శ‌ర‌త్‌బాబు ఆరోగ్యానికి సంబంధించి మీడియాలో ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.…

విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ కాస్త తొంద‌ర‌ప‌డ్డారు. ప్రముఖ న‌టుడు శ‌ర‌త్‌బాబు తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. శ‌ర‌త్‌బాబు ఆరోగ్యానికి సంబంధించి మీడియాలో ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో శ‌ర‌త్‌బాబు ప్రాణానికి సంబంధించి ఓ చేదు వార్త సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది క‌మ‌ల్‌హాస‌న్ కంట‌ప‌డింది.

దీన్ని నిజ‌మ‌ని న‌మ్మిన క‌మ‌ల్‌హాస‌న్ త‌న మిత్రుడికి ఏకంగా ట్విట‌ర్ వేదిక‌గా నివాళుల‌ర్పించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన త‌ప్పిదాన్ని తెలుసుకుని నాలుక్క‌రుచుకున్నారు. నిజానికి శ‌ర‌త్‌బాబు ఆరోగ్యం అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉంది. హైద‌రాబాద్‌లో ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ఆరోగ్యంపై వ‌దంత‌లు న‌మ్మొద్ద‌ని శ‌ర‌త్‌బాబు సోద‌రి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆరోగ్యానికి సంబంధించి అవాస్త‌వాలు ప్ర‌చార‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో శ‌ర‌త్‌బాబు ఇక లేర‌నే వార్త‌ను క‌మ‌ల్‌హాస‌న్ చూసి షాక్‌కు గుర‌య్యారు. ఈ వార్త‌లో నిజానిజాల్ని తెలుసుకోకుండా ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. క‌మ‌ల్‌హాస‌న్ ఎలా స్పందించారంటే… ” ప్రియమైన పెద్దన్న శరత్‌బాబు నాకు మంచి మిత్రుడు. శ‌ర‌త్‌బాబు మంచి మనసున్న మ‌నిషి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం” అంటూ ఆయ‌న‌ ట్వీట్ చేశారు. 

ఆ త‌ర్వాత వాస్త‌వం తెలుసుకుని వెంట‌నే ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ లోపే ఆయ‌న ట్వీట్‌ను నెటిజ‌న్లు స్క్రీన్ షాట్ తీసి వైర‌ల్ చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.