తమిళ బుల్లితెర నటి చిత్ర ఇటీవల చెన్నైలో ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక ఆధారాలు మాయం అయ్యాయి. ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని విచారిస్తున్నారు. కాగా చిత్రది ఆత్మహత్య కాదు …హత్యే అనే అనుమానాలు లేకపోలేదు.
బలవన్మరణానికి పాల్పడేట్టు కుటుంబ సభ్యులే ఉసిగొల్పారనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగా చిత్ర భర్త, ఆమె తల్లి పోరు పడలేకే అర్ధాంతరంగా ప్రాణం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో కీలక ఆధారాలను కూడా హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు విషయమై నాలుగో రోజు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుగొలిపే నిజాలు తెలిసొచ్చాయి. చిత్ర సెల్ఫోన్లోని ముఖ్యమైన ఫొటోలు, కీలక ఎస్ఎంఎస్ , వాట్సప్ సందేశాలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. వీటిని మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చిత్ర ఆత్మహత్యకు, సెల్లోని ఫొటోలు, వాట్సప్ సందేశాలు, ఎస్ఎంఎస్ మెసేజ్లతో సంబంధం ఉండడం వల్లే ఇంటి దొంగలే ఆ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేసేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.
ముఖ్యంగా చిత్ర ఆత్మహత్యకు ఆమె భర్త, తల్లి నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిళ్లే కారణమని పోలీసులు చెబుతున్నారు. నిజానికి హేమనాథ్తో జనవరిలో చిత్ర పెళ్లి జరగాల్సి ఉంది. అయితే అంతకు ముందుగానే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయమై చిత్రను ఆమె తల్లి గట్టిగా నిలదీస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు షూటింగ్లో ఉన్న చిత్రను సమయం సందర్భం లేకుండా హేమనాథ్ కలుసుకునే వాడని తెలుస్తోంది. సీరియల్ నటుడితో హేమ సన్నిహితంగా మెలగడాన్ని చూసి అతను తట్టుకోలేక పోయాడని సమాచారం. దీంతో షూటింగ్ స్పాట్లోనే ఆమెతో హేమనాథ్ గొడవపడ్డాడని సహనటులు పోలీసులకు విచారణలో తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఈ పరిణామాలన్నింటిని చూస్తే కుటుంబ సభ్యుల టార్చర్ వల్లే చిత్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారని సమాచారం. మొత్తానికి ఆమె సెల్ఫోన్లో మాయమైన అంశాల గురించి నిజాలు రాబడితే, కేసు మిస్టరీ వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.