Advertisement

Advertisement


Home > Movies - Movie News

మలయాళీ ముద్దుగుమ్మలు మెప్పించలేకపోతున్నారు

మలయాళీ ముద్దుగుమ్మలు మెప్పించలేకపోతున్నారు

ఒకప్పుడు మలయాళం నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు టాలీవుడ్ ను ఏలిన సందర్భాలున్నాయి. కేరళ నుంచి అందగత్తెల రాక టాలీవుడ్ కు తగ్గలేదు. ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. ఎటొచ్చి వాళ్ల హవా మాత్రం టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించడం లేదు. 90శాతం మంది మెప్పించలేక చతికిలపడుతున్నారు. క్రేజ్ కోసం పరితపిస్తున్నారు.

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మలయాళీ హీరోయిన్లలో సాయిపల్లవి మాత్రమే కొద్దొగొప్పో క్రేజ్ తో కొనసాగుతోంది. అయినప్పటికీ గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడీమెకు లేదు. ఫిదా, ఎంసీఏ సినిమాల తర్వాత సాయిపల్లవి ఇమేజ్ అమాంతం పడిపోయింది. పడిపడి లేచే మనసు తర్వాత ఈమె హవా తగ్గింది. రీసెంట్ గా వచ్చిన ఎన్జీకే సినిమా సాయిపల్లవి క్రేజ్ ను మరింత తగ్గించింది. ప్రస్తుతం ఈమె తన ఆశలన్నీ విరాటపర్వం సినిమాపైనే పెట్టుకుంది.

మరో హీరోయిన్ కీర్తిసురేష్ కూడా ఇలానే క్రేజ్ పోగొట్టుకుంది. మహానటితో ఈమె ఇమేజ్ ఆకాశాన్నంటింది. కానీ ఆ ఇమేజ్ ను అలానే కొనసాగించడంలో ఆమె ఫెయిల్ అయింది. ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది. దానిపై ఎలాంటి అంచనాల్లేవు. మరోవైపు మన్మధుడు-2లో నటిస్తున్నప్పటికీ అది గెస్ట్ రోల్ మాత్రమే. ఈమె చేసిన తప్పంతా మహానటి తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లడమే. కొన్నాళ్ల పాటు తెలుగులోనే కొనసాగించి ఉంటే ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉండేది.

సాయిపల్లవి, కీర్తిసురేష్ తర్వాత ఆకట్టుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నివేత థామస్. యాక్టింగ్ టాలెంట్ పుష్కలంగా ఉంది. కానీ తెలుగులో ఆమెకు క్రేజ్ మాత్రం రావట్లేదు. రీసెంట్ గా వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా కూడా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ ను శ్రీవిష్ణు కొట్టేశాడు. నిన్నుకోరి, 118 సినిమాల రేంజ్ లో బ్రోచేవారెవరురా మూవీ నివేతకు కలిసిరాలేదు.

వీళ్లు మాత్రమేకాదు.. అనుపమ పరమేశ్వరన్, అను ఎమ్మాన్యుయేల్ కూడా అక్కడ్నుంచే వచ్చారు. కానీ మెప్పించలేకపోతున్నారు. అజ్ఞాతవాసి తర్వాత అను ఎమ్మాన్యుయేల్ పరిస్థితి ఘోరంగా తయారైంది. నాగచైతన్యతో కలిసి ఆమె నటించిన శైలజారెడ్డి అల్లుడు కూడా ఫ్లాప్ అవ్వడంతో ప్రస్తుతం అవకాశాల్లేక ఇబ్బంది పడుతోంది. అటు అనుపమ పరమేశ్వరన్ కూడా క్రేజ్ తెచ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. అ..ఆ, శతమానంభవతి హిట్ అయినప్పటికీ ఆమెకు కలిసిరాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో రాక్షసుడు అనే సినిమా ఒక్కటే ఉంది.

మంజిమా మోహన్, మడొన్నా సెబాస్టియన్ అయితే ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. సాహసం శ్వాసగా సాగిపో సినిమా తర్వాత మంజిమా మోహన్ మళ్లీ కనిపించలేదు. అటు మడొన్నా సెబాస్టియన్ కూడా ప్రేమమ్ తర్వాత కనిపించలేదు. ఇలా ఈమధ్య కాలంలో వచ్చిన మలయాళీ ముద్దుగుమ్మలెవ్వరూ స్టార్ స్టేటస్ అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కన్నడ, తమిళ భామలదే హవా నడుస్తోంది.

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?