Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా కాంపౌండ్ లో 'తెనాలి' బ్యాచ్

మెగా కాంపౌండ్ లో 'తెనాలి' బ్యాచ్

మీది తెనాలి.. మాది తెనాలి అంటే మనం మనం ఒకటే అని అర్థం. సినిమాలైనా, వ్యాపారమైనా అన్నీ వాళ్లలో వాళ్లే అన్నమాట. అంటే డబ్బులు వాళ్లే పెడతారు, లాభాలు వాళ్లే తీసుకుంటారు. రామ్ చరణ్ కొణెదల బ్యానర్ పెట్టినప్పట్నుంచి కాంపౌండ్ లో ఈ కల్చర్ మరింత ఎక్కువైంది. ఇప్పుడు దీన్ని మరింత ఎత్తులకు తీసుకెళ్తున్నారు మెగా హీరోలు.

అల వైకుంఠపురములో సినిమాకు గీతాఆర్ట్స్ కూడా నిర్మాత. బన్నీ నెక్ట్స్ సినిమాకు కూడా కాంపౌండ్ కనెక్షన్ ఉంది. మైత్రీ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న సినిమాకు ముత్తంశెట్టి మీడియాను సహ-నిర్మాతగా చేర్చారు. వీళ్లు బన్నీకి దగ్గర బంధువులు. బన్నీ కాల్షీట్లు ఈ సంస్థకిచ్చి, ఈ సంస్థ నుంచి మైత్రీ ఆ కాల్షీట్లను కొనుక్కునేలా ప్లాన్ చేశారు. అంటే సినిమాతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ముత్తంశెట్టి మీడియాకు లాభం అన్నమాట.

ఇక చిరంజీవి సంగతి సరేసరి. ఆయన రీఎంట్రీ నుంచి బయట బ్యానర్లలో సినిమాలు చేయడమే మానేశారు. కొడుకుతో కొణెదల ప్రొడక్షన్స్ అంటూ ఏకంగా ఓ బ్యానర్ పెట్టించారు. ''నాన్నకు ప్రేమతో'' అంటూ చరణ్ ఈ బ్యానర్ పెట్టాడని ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకున్నా.. బిజినెస్ కోసం తండ్రికొడుకులు ఇలా కలిశారు. తండ్రి క్రేజ్ ను కొడుకు క్యాష్ చేసుకుంటాడు.. కొడుకు కోసం తండ్రి లాభాలు తెచ్చిపెడతాడన్నమాట.

ఖైదీ నంబర్ 150, సైరా సినిమాల్ని నిర్మించిన రామ్ చరణ్.. భవిష్యత్ లో తన బ్యానర్ ను మరింత విస్తరించబోతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి-కొరటాల సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న చరణ్.. త్వరలోనే ఈ బ్యానర్ పై పవన్ కొడుకు అకిరా, వరుణ్ తేజ్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అంటే.. ఈ బ్యానర్ పై పూర్తిగా మెగా హీరోలే నటిస్తారన్నమాట.

అటు పవన్ కల్యాణ్ కు కూడా ఇలాంటి బిజినెస్ ఆలోచన ఒకటి ఉంది. తన బ్యానర్ (పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్)పై చరణ్ హీరోగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాడు కల్యాణ్. కేవలం డబ్బు కోసమే మళ్లీ సినిమాల్లొకొచ్చారు పవన్. ఫ్యాన్స్ నొచ్చుకున్నా ఇది పచ్చి నిజం. ప్రస్తుతం తను హీరోగా నటిస్తున్న సినిమాలు పూర్తయిన వెంటనే చరణ్ తో సినిమా నిర్మించాలని పవన్ అనుకుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లోపు చరణ్, సాయితేజ్ తో సినిమాలు నిర్మించాలనేది పవన్ ప్లాన్. మొత్తంగా వచ్చే ఎన్నికల నాటికి ఓ 400 కోట్లు సంపాదించాలనేది పవన్ మాస్టర్ ప్లాన్.

అటు నాగబాబు కూడా కొడుకుతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా నిర్మించే ఆలోచనలో ఉన్నారు. వరుణ్ ఇప్పటికే అల్లు బాబి (అల్లు అర్జున్ అన్నయ్య) నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత నాగబాబుతో మూవీ ఉండొచ్చు.

ఇలా మెగా హీరోలంతా తమ వాళ్లతోనే సినిమాలు చేస్తూ.. లాభాల్ని కూడా తమ కాంపౌండ్ లోనే ఉంచుకుంటున్నారు. ప్రస్తుతానికి వీళ్లంతా బయట నిర్మాతలతో సినిమాలు చేస్తున్నప్పటికీ.. రాబోయే రోజుల్లో సొంత బ్యానర్లలోనే ఎక్కువ సినిమాలు కనిపిస్తున్నాయి.

మరో 'సామజవరగమన' వస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?