డ‌బ్బింగ్ సినిమాల‌తో న్యూ ఇయ‌ర్ ప్రారంభం!

2020 సంవ‌త్స‌రం తొలి రోజు డ‌బ్బింగ్ సినిమాల విడుద‌ల‌తో ప్రారంభం కానుంది.  న్యూ ఇయ‌ర్ రోజున అరుదుగా మాత్ర‌మే తెలుగు సినిమాల విడుద‌ల‌లు ఉంటాయి. అయితే కొత్త సంవ‌త్సరంలో తొలి రోజున మాత్రం డైరెక్ట్…

2020 సంవ‌త్స‌రం తొలి రోజు డ‌బ్బింగ్ సినిమాల విడుద‌ల‌తో ప్రారంభం కానుంది.  న్యూ ఇయ‌ర్ రోజున అరుదుగా మాత్ర‌మే తెలుగు సినిమాల విడుద‌ల‌లు ఉంటాయి. అయితే కొత్త సంవ‌త్సరంలో తొలి రోజున మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ విడుద‌ల కావ‌డం లేదు. సంక్రాంతి విడుద‌ల‌లే కొత్త సంవ‌త్స‌రంలో ప్ర‌ముఖంగా నిల‌వ‌నున్నాయి.

త‌మిళ హీరో ధ‌నుష్, మ‌ల‌యాళ హీరో మ‌మ్ముట్టీల సినిమాలు రేపు తెలుగులో విడుద‌ల కాబోతున్నాయి. ఇది వ‌ర‌కే అక్క‌డ విడుద‌లై విజ‌య‌వంతం అయిన మ‌మ్ముట్టీసినిమా 'రాజా న‌ర‌సింహ‌' పేరుతో విడుద‌ల కాబోతోంది. ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు కూడా ఒక ముఖ్య పాత్ర‌లో న‌టించాడు. 'మ‌న్యంపులి' ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించాడు.

ఇక ధ‌నుష్ – గౌత‌మ్ మీన‌న్ కాంబోలో రూపొందిన ఒక సినిమా 'తూటా' పేరుతో తెలుగులో విడుద‌ల అవుతోంది. ఈ సినిమా విడుద‌ల విష‌యంలో ప‌లు వాయిదాలు ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కూ రేపు విడుద‌ల కాబోతూ ఉంది. గౌత‌మ్ మీన‌న్ సినిమాల‌కు తెలుగులో ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉండేది. 

ఇక ధ‌నుష్ డైరెక్టుగా తెలుగు వారిని ఆక‌ట్టుకున్న సినిమాలు త‌క్కువే. అయితే ఆస‌క్తిదాయ‌క‌మైన కాంబో అయిన ఈ సినిమా ఆక‌ట్టుకున్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్యం లేదు. ఐదేళ్ల కింద‌ట ధ‌నుష్ సినిమా 'ర‌ఘువ‌ర‌న్ బీటెక్' ఇలాగే జ‌న‌వ‌రి ఒక‌టో  తేదీన విడుద‌లై హిట్ అయ్యింద‌ట‌. ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల త‌ర్వాత ధ‌నుష్ సినిమా ఒక‌టి న్యూ ఇయ‌ర్ ఫ‌స్ట్ డేన విడుద‌ల కాబోతోంది.