నిర్మాతల పోటీ..డైరక్టర్లకు లాభం

ఈ మధ్య టాలీవుడ్ లో యంగ్ ప్రొడ్యూసర్లు ఎక్కువయ్యారు. దాంతో సినిమాలు అడ్వాన్స్ గా ప్లాన్ చేయడం, పోటా పోటీగా అడ్వాన్స్ లు ఇవ్వడం ఎక్కువయిపోయింది. కనిపించిన డైరక్టర్ ను కనిపించినట్లు అడ్వాన్స్ లు…

ఈ మధ్య టాలీవుడ్ లో యంగ్ ప్రొడ్యూసర్లు ఎక్కువయ్యారు. దాంతో సినిమాలు అడ్వాన్స్ గా ప్లాన్ చేయడం, పోటా పోటీగా అడ్వాన్స్ లు ఇవ్వడం ఎక్కువయిపోయింది. కనిపించిన డైరక్టర్ ను కనిపించినట్లు అడ్వాన్స్ లు ఇచ్చేసి లోపల లాగిపడేయడం అన్నది పెరిగింది. 

ఎంత ఒక్క సినిమా తీసిన డైరక్టర్ అయినా కనీసం పదిలక్షలు అడ్వాన్స్ చేతిలో పెట్టేస్తున్నారు. ఏ డైరక్టర్ ఎప్పుడు హిట్ ఇస్తాడో, ఏ డైరక్టర్ చేతిలో వుంటే ఏ హీరో సై అంటాడో అని స్పెక్యులేషన్ గేమ్ ఆడేస్తున్నారు. 

ఒక్క హిట్ కొట్టిన ప్రతి డైరక్టర్ దగ్గరా ఇప్పుడు ఒకటి, రెండుకు మించిన అడ్వాన్స్ లు వున్నాయి. ఎవరి దగ్గరా కథలు రెడీగా లేవు కానీ అడ్వాన్స్ లు మాత్రం పుష్కలంగా వున్నాయి. అలా అని వారి తప్పు కాదు, వద్దన్నా పిలచి అడ్వాన్స్ లు చేతిలో పెట్టేస్తున్నారు. 

మైత్రీ మూవీస్ సంస్థ ఇలా అడ్వాన్స్ లు ఇచ్చే ఈ రోజు మాంచి ప్రామినెంట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది. వడ్డీలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ భరించడంతో ఈరోజు పలు సినిమాలు లైన్ లో వున్నాయి. 

ఇది చూసి మిగిలిన వారు కూడా ఫాలో..ఫాలో అనాలనుకుంటున్నారు. కానీ అన్ని అడ్వాన్స్ లు వర్కవుట్ కావు. సరైన వారికి అడ్వాన్స్ లు పడాలి తప్ప ఇంత మందికి అడ్వాన్స్ లు ఇచ్చాం అని చెప్పుకోవడం కోసం అయితే వృధానే. 

కానీ నిర్మాతలు మాత్రం ఏం చేయగలరు? ఎవరి దగ్గర డైరక్టర్లు వుంటే వాళ్లకే హీరోలు డేట్లు ఇస్తున్నారు. అందుకోసం ఇలా చేయక తప్పడం లేదు. మొత్తం మీద ఇప్పుడు ఒక్క హిట్ కొడితే చాలు డైరక్టర్లకు టైమ్ బాగుంటోంది.