నైజాంలో థియేటర్లు తేలలేదు

పండగ సినిమాలకు థియేటర్లు అనే పాయింట్ మీద నైజాంలో పంచాయతీ ఇంకా తేలలేదు. ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి..ఏ సినిమాకు ఏ థియేటర్లు వుంటాయి అన్నది ఇంకా ఖరారు కాలేదు. పంచాయతీ నడుస్తూనే…

పండగ సినిమాలకు థియేటర్లు అనే పాయింట్ మీద నైజాంలో పంచాయతీ ఇంకా తేలలేదు. ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి..ఏ సినిమాకు ఏ థియేటర్లు వుంటాయి అన్నది ఇంకా ఖరారు కాలేదు. పంచాయతీ నడుస్తూనే వుంది. 

పంచాయతీ ఎందుకంటే థియేటర్లు చేతిలో వున్నారు చెప్పే మాట సినిమాలు విడుదల చేసేవారికి నచ్చడం లేదు కనుక. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్..తనకు ఫలానా ఫలానా థియేటర్లు కావాలి..వాటికి అద్దె ఎంత..రూల్స్ ఏమిటి అని అడగడం కామన్. కానీ ఇక్కడ వ్యవహారం రివర్స్ లో వుందని తెలుస్తోంది.

ఆసియన్ సంస్థ ఓ యాభై థియేటర్ల జాబితాను వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి డిస్ట్రిబ్యూటర్ శశికి పంపించి, వాటిల్లోంచి నచ్చిన వాటిని ఎంపిక చేసుకోమని కోరినట్లు తెలుస్తోంది. అలా ఎలా అవుతుంది..మాకు కావాల్సిన థియేటర్లు మేం అడుగుతాం అని డిస్ట్రిబ్యూటర్ చెబుతున్నారని బోగట్టా. మా దగ్గర వున్న థియేటర్ల లిస్ట్ ఇచ్చాం. వాళ్లకు కావాల్సినవి తీసుకోమన్నాం..తప్పా అంటున్నారు వాళ్లు. ఇలా ఎవరి వెర్షన్లు వారు వినిపిస్తున్నారు. ఎవరి వెర్షన్ వాళ్లదే కరెక్ట్ అనేట్లు వుంది వ్యవహారం.

అలాగే కొన్ని థియేటర్ల రిన్నోవేషన్ కు ఎక్కువ ఖర్చు చేసాం. అక్కడ షేరింగ్ ఆడాల్సిందే. ఎక్కువ ఖర్చు చేసిన రిన్నోవేట్ చేసిన వాటికి షేరింగ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ రూల్ వుంది అని ఒకరు అంటారు. పెద్ద సినిమాలు తొలివారమే షేరింగ్ ఎలా ఇస్తామని వీళ్లు అంటారు. అలా అయితే రెంట్ ఎక్కువ అవుతుందని వాళ్లు అంటారు.

ఇదిలా వుంటే చాలా వరకు వైట్ లావాదేవీలే వుంటాయి. కొన్ని సింగిల్ థియేటర్లకు అటు ఇటు వుంటాయి. అందువల్ల పేపర్ మీద లెక్కలు రాసివ్వలేము అని వీళ్లు అంటారు. అలా కాదు..ముందే రెంట్లు అన్నీ ఇన్ రిటెన్ ఇవ్వాలని వాళ్లు అంటారు.

నైజాం మొత్తం మీద 600 స్క్రీన్ల వరకు వున్నాయి. మూడు పెద్ద సినిమాలు, ఓ చిన్న సినిమా విడుదలవుతున్నాయి. చిన్న సినిమా సంగతి పక్కన పెడితే మూడు సినిమాలకు తలా రెండు వందల స్క్రీన్ లు వస్తాయి. దానికి ఆసియన్ సునీల్..దిల్ రాజు/శిరీష్, మైత్రీ శశి కూర్చుని పరిష్కరించుకోవాల్సి వుంది. అలా జరగనంత వరకు థియేటర్ల లెక్క తేలదు.