ప‌నామా పేప‌ర్స్.. ఐశ్వ‌ర్య‌రాయ్ త‌ర్వాత ఎవ‌రెవ‌రు?

ప‌నామా పేప‌ర్స్ లో పేరున్న తార‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లో అక్ర‌మ పెట్టుబ‌డుల అభియోగాల నేప‌థ్యంలో.. వీరిని ఈడీ విచారిస్తూ ఉంది. చాన్నాళ్ల కింద‌టే ఈ జాబితా వెల్ల‌డి అయ్యింది.…

ప‌నామా పేప‌ర్స్ లో పేరున్న తార‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లో అక్ర‌మ పెట్టుబ‌డుల అభియోగాల నేప‌థ్యంలో.. వీరిని ఈడీ విచారిస్తూ ఉంది. చాన్నాళ్ల కింద‌టే ఈ జాబితా వెల్ల‌డి అయ్యింది. మీడియాలో సంచ‌ల‌నం రేపిన ఈ జాబితాకు సంబంధించి ఇప్పుడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ సాగిస్తూ ఉంది. ఈ క్ర‌మంలో న‌టి ఐశ్వ‌ర్య‌రాయ్ విచార‌ణ‌కు హాజ‌రైంది. దాదాపు ఆరు గంట‌ల పాటు ఆమెను ఈడీ అధికారులు ప్ర‌శ్నించిన‌ట్టుగా తెలుస్తోంది.

ప‌లు వాయిదాల అనంత‌రం ఐశ్వ‌ర్య ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైంది. మ‌రి త‌దుప‌రి చ‌ర్య‌లు ఏముంటాయో చూడాల్సి ఉంది. ఆ సంగ‌త‌లా ఉంటే.. ఐశ్వ‌ర్య త‌ర్వాత ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ప‌నామా పేప‌ర్స్ విచార‌ణ‌లో భాగంగా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. వీరిలో ఐశ్వ‌ర్య‌రాయ్ మామ‌, బాలీవుడ్ బిగ్ అమితాబ్ కూడా ఉన్నారు.

అమితాబ్ తో పాటు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి రావొచ్చ‌ని టాక్. అలాగే మ‌రో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా ఈ వ్య‌వ‌హారాల్లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంద‌ని స‌మాచారం. అయితే ప‌నామా పేప‌ర్స్ లీకేజ్ స‌మ‌యంలోనే వీరు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

ఈ అంశంపై అమితాబ్ స్పందిస్తూ.. త‌నకు సంబంధం ఉన్న‌ట్టుగా పేర్కొన్న కంపెనీల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని అమితాబ్ అప్ప‌ట్లోనే చెప్పాడు. మీడియాలో నానుతున్న ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు.

ఇక అజ‌య్ దేవ‌గ‌ణ్ స్పందిస్తూ… బ్రిటిష్ వ‌ర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న త‌న పెట్టుబ‌డుల‌కు సంబంధించి, త‌న పెట్టుబ‌డ‌ల‌న్నీ స‌క్ర‌మ ఛాన‌ల్స్ ద్వారానే వెళ్లాయ‌ని చెప్పుకొచ్చాడు. మ‌రి వీరి విచార‌ణల తీరు, ఈడీ స్పంద‌న ఎలా ఉంటుందో!