కళాకారులపై సెటైర్లు వేయడంలో దిట్ట దర్శకుడు జంధ్యాల. తను సినిమా వాడు, రచయిత అయినా.. రచయితలపై ఆయన సినిమాల్లో ఉన్నన్ని సెటైర్లు మరెవరి సినిమాల్లో ఉండవు.
కేవలం రచయితలు అనే కాదు, కళాకారులపై కళాత్మకంగా సెటైర్లు దంచడంలో జంధ్యాల తర్వాత మరెవరూ సాటి రారు. మరి ఆ మహా రచయిత నుంచి జాలువారిన వ్యంగ్యం.. ఊరికే రాసిపడేసింది కాదని, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు గుర్తు చేస్తూ ఉన్నారు. తన సినిమాల్లో పవన్ కల్యాణ్ తనంటే పడని వారిపై పేరడీలు, వారిపై డైలాగులు వేసుకుంటూ ఉన్నారు. జనసేన ఆవిర్భావం తర్వాత ఈ తంతు బాగా ఎక్కువైంది!
ఈ క్రమంలో ఇలాంటి వాళ్లపై ఎప్పుడో జంధ్యాల సెటైర్లు వేసిన వైనం గుర్తుకు వస్తుంది. ఇలాంటి వారిని కమేడియన్లుగా పెట్టి జంధ్యాల సినిమాలు తీశారు. అచ్చంగా దేముడు పవన్ కల్యాణ్, ఆయన బంటు త్రివిక్రమ్ ల తీరు ఇలానే ఉంది. వీరు తీస్తున్న రీమేక్ సినిమాల్లో పవన్ కల్యాణ్ కు పడని వారిపై సెటైర్లు పెడుతున్నారు. ఇదెలా ఉందంటే.. చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి తరహాలో ఉంది.
ఆ సినిమాలో రచయిత్రిగా శ్రీలక్ష్మి పాత్ర తెలుగు వారు మరిచేది కాదు. నన్ను కవిని కాదనే వారిని కత్తితో పొడుస్తా… అంటూ ఆమె కవయిత్రిగా చెలరేగి కామెడీ చేస్తారు. తోచినట్టుగా కవితలు, నవలలు ఆమె రాసిపడేస్తారు. ఆ సినిమాలో ఒక సీన్లో ఆమెకూ, ఆమె తోడికోడలుకు గొడవవస్తుంది. అప్పుడు శ్రీలక్ష్మి పాత్ర ఆమెతో గొడవపడుతూ.. 'చూడు.. నీ పేరు విలన్ కు పెట్టి నవల రాస్తా..' అంటూ తన తోడికోడలిని హెచ్చరిస్తుంది!
పాత్రోచితంగా జంధ్యాల రాసిన డైలాగ్.. కామెడీకి పరాకాష్ట. రచయితలు, కళాకారుల తీరుపై ఆయన పండించిన హ్యూమర్! శ్రీలక్ష్మి హెచ్చరిక కామెడీ. అదే కామెడీని ఇప్పుడు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ చేస్తున్నారు. వీరు తమకు నచ్చని వారిని, పవన్ కల్యాణ్ ను విమర్శించే వారిని టార్గెట్ గా సినిమాల్లో పాత్రలు పెట్టుకుంటున్నారు! రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా కామెడీలు చేస్తూ ఉన్నారు. మరి ఆ సినిమాలో శ్రీలక్ష్మి హెచ్చరిక కల్ట్ కామెడీగా గుర్తుండిపోతుంది.
ఇప్పుడు పవన్ , త్రివిక్రమ్ ల ఫీట్లు కూడా అలాంటి కామెడీ సరసన నిలుస్తున్నాయి! చాలా సినిమాల్లో జంధ్యాల డైలాగులను తిరగ రాసిన అనుభవం ఉన్న త్రివిక్రమ్ కు తమ తీరు చంటబ్బాయ్ లో శ్రీలక్ష్మి చేసినా కామెడీని తలపింపచేస్తుందని గుర్తుకురాలేదేమో!
-జీవన్