పట్టు వీడని హీరోయిన్.. ప్రచారానికి డుమ్మా

కొన్ని రోజుల కిందటి సంగతి. రక్షణ సినిమాకు సంబంధించి మేకర్స్ పై హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా దర్శక-నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ కూడా ఫిలిం…

కొన్ని రోజుల కిందటి సంగతి. రక్షణ సినిమాకు సంబంధించి మేకర్స్ పై హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి కౌంటర్ గా దర్శక-నిర్మాత ప్రణదీప్ ఠాకూర్ కూడా ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ మేటర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు, అట్నుంచిఅటు ముంబయిలోని ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా వెళ్లింది.

ఆ తర్వాత ఈ వివాదంపై ఎవ్వరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. పాయల్ వెనక్కు తగ్గిందని, తనకు రావాల్సిన బ్యాలెన్స్ మొత్తం తీసుకొని ప్రచారం చేయబోతోందంటూ కథనాలు వచ్చాయి. అయితే పాయల్ పట్టువీడినట్టు కనిపించడం లేదు.

రక్షణ సినిమా రేపు రిలీజ్ అవుతోంది. ఇప్పటివరకు పాయల్ మీడియా ముందుకు రాలేదు. ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పోస్టర్లు, పాటలు, మేకింగ్ వీడియోస్ మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. లీడ్ రోల్ పోషించిన పాయల్ మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించలేదు.

తనను సంప్రదించకుండా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని ఆమె కొన్ని రోజుల కిందట ఆరోపించింది, పైగా ప్రచారానికి ఎందుకు రావంటూ అసభ్య పదజాలంతో దూషించారని కూడా ఆరోపణలు చేసింది.

ఇలాంటి వివాదాల్లో తొందరగానే రాజీ ప్రయత్నాలు జరుగుతాయని అంతా అనుకున్నారు. కానీ పాయల్ మాత్రం ఎక్కడో గట్టిగా హర్ట్ అయినట్టుంది. ఈ సినిమా ప్రమోషన్ కు ఇక పాయల్ వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. లీడ్ యాక్టర్ ప్రచారం చేయకుండానే సినిమా రిలీజ్ అవుతోంది.