ఒక నటిగా తన ఆకలి ఏ మాత్రం తీరలేదని అంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది ఇప్పటి వరకూ తనవి ఐదు సినిమాలు విడుదల అయ్యాయని చెప్పుకుంటూనే.. ఇదే సమయంలో వచ్చే ఏడాది ఎన్ని సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్రలు చేయాలనే అంశం మీదే తన దృష్టంతా ఉందంటూ రకుల్ వివరిస్తోంది. రకరకాల పాత్రలు చేయాలి, బోలెడన్ని సినిమాలు చేయడం తప్ప తనకు మరో ధ్యాస లేదని రకుల్ తన కళాతృష్ణను చాటి చెబుతూ ఉంది.
రకుల్ దాదాపు దశాబ్దకాలం నుంచి సినిమా రంగంలో ఉంది. ఆదిలో అంత గుర్తింపు రాలేదు. తెలుగులో చేసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో రకుల్ దశ తిరిగింది. ఆ సినిమా తర్వాత ఆమెకు వరస పెట్టి అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా బాగానే ఆడటంతో.. స్టార్ హీరోల సరసన అవకాశాలు లభించాయి రకుల్ కు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ లతో నటించి తను కూడా స్టార్ అయిపోయింది. స్టార్ హీరోయిన్ గా కొంతకాలం పాటు బిందాస్ గా కొనసాగింది రకుల్ కెరీర్. అయితే తర్వాతి కాలంలో కొన్ని సినిమాల ఫ్లాపులతో రకుల్ కెరీర్ మందగమనంలో పడింది.
అయితే ఈ దశలో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ, ఆ పై బాలీవుడ్ ఆదుకుంది. ఒకప్పుడు తను స్టార్ గా వెలుగొందిన తెలుగులో రకుల్ ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. ఇలాంటి నేపథ్యంలో ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ కాబోతోందనే ప్రచారం కూడా ఆ మధ్య జరిగింది. అయితే రకుల్ అదంతా ఒట్టి పుకారే అని తెరదించింది.
మరి ఇన్నేళ్ల తర్వాత కూడా తనకు ఇంకా చాలా సినిమాలు, రకరకాల భిన్నమైన పాత్రలు చేయాలనే ఆకలే తప్ప మరో ధ్యాసే లేదని రకుల్ స్టేట్ మెంట్ ఇవ్వడం గమనార్హం. మరి రకుల్ కు ఆసక్తి ఉంది సరే, ఇంతకీ రకుల్ మీద సినిమా పరిశ్రమలకు ఉన్న ఆసక్తి ఎంత అనేదే ఆమె కెరీర్ కు ఇప్పుడు కీలకమైన అంశం.
ఆమె చేతిలో ఒకటీ రెండు బాలీవుడ్ సినిమాలు, భారతీయుడు -2 ఉన్నట్టున్నాయి. ఈ సినిమాల ఫలితాలు కూడా ఆ దశలో రకుల్ కు ఇంపార్టెంటే.