కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచిన వారిలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందు వరుసలో నిలిచారు. అడగని వారే పాపాత్ములు అన్నట్టు, భాష, ప్రాంతం, కులమతాలు అనే పట్టింపులేవీ లేకుండానే పేదరికం, కష్టాలే ప్రామాణికంగా సోనూసూద్ ఆపన్న హస్తం అందించారు.
మదనపల్లెకు చెందిన రైతు కుటుంబానికి, హైదరాబాద్లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థినికి, విదేశాల్లో చిక్కుకున్న వారికి విమాన సౌకర్యం….ఇలా ఒకటా రెండా సోనూసూద్ నుంచి సాయం పొందిన సంఘటనల గురించి ఎన్నైనా చెప్పొచ్చు.
ఇంతకాలం కేవలం బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన సోనూసూద్ తన సేవానిరతితో యావత్ దేశ ప్రజల దృష్టిలో రియల్ హీరో అయ్యారు. అయితే ప్రతి ఒక్కరికీ సాయం అందించడానికి ఆయనకున్న ఆర్థిక వనరులేంటి? అనే ప్రశ్నలు కూడా రాకపోలేదు.
తాజాగా ఆయన ఆర్థిక పరిస్థితి వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి సోనూసూద్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కేవలం ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సోనూసూద్ రూ.10 కోట్లు జమ చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇందు కోసం ఎవరి వద్దా చేయి చాచి అడగలేదు.
ముంబై జూహూలోని తన ఎనిమిది ఆస్తులను తనఖా పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకుని.. ఆ డబ్బుతో సాయం అందిస్తూ వచ్చారు. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ప్లాట్లు ఉన్నట్టు సమాచారం.
సోనూసూద్ అప్పుల విషయమై జెఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్ రితేష్ మెహతా స్పందిస్తూ …ఆస్తులన్నీ సోనూసూద్, ఆయన భార్య పేరుపై ఉన్నాయన్నారు. తనఖా తర్వాత రూ.10కోట్లకు వడ్డీ, అసలు చెల్లించాల్సి ఉందన్నారు. ఎదుటి వారి కోసం ఇలాంటి పని చేసేవారిని తాను ఇంత వరకూ చూడలేదన్నారు.