విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యానికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాల్లో భాగంగా మరణానంతరం బాలూకు పద్మవిభూషణ్ దక్కింది.
ఇది దేశ అత్యున్నత పౌర పురస్కారాల వరసలో రెండోదని వేరే చెప్పనక్కర్లేదు. భారతరత్న అనంతరం అత్యున్నత పురస్కారంగా పద్మవిభూషణ్ ఉంది. ఇది దక్కినందుకు బాలూ అభిమానగణానికి అనందమే. అయితే బాలూకు భారతరత్న పురస్కారం ప్రకటించకపోవడం మాత్రం కేవలం వ్యవస్థ వైఫల్యం మాత్రమే.
భారతరత్న పురస్కారానికి ఎస్పీబీ ఏ రకంగా అర్హుడనే అంశం గురించి ఎవరికీ వివరించి చెప్పనక్కర్లేదు. అలా వివరించాలని కోరుకునే వాళ్లకు వివరించీ ప్రయోజనం లేదు. ఆల్రెడీ హిందీ పాటల గాయకులకు భారతరత్న ఇచ్చినట్టున్నారు. వాళ్లకు ఆ పురస్కారాలు ఇచ్చి, బాలూకు ఇవ్వకపోడం దక్షిణాదిపై ఉన్న వివక్షగా చాలా మంది భావించినా పెద్ద ఆశ్చర్యం లేదు.
పద్మవిభూషణ్ ప్రకటించారనే గొప్ప కన్నా, భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? అనే ప్రశ్నే ఎక్కువగా మెలిపెడుతూ ఉంది ఎస్పీబీ విషయంలో. బాలూను భారతరత్నగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదన కూడా పంపింది.
అయితే బాలూను అధికారికంగా భారతరత్నగా కేంద్రం ప్రకటించాల్సిన అవసరం లేదు. ప్రజల ప్రతి రోజూ దైనందిన చర్యల్లో బాలూ అనునిత్యం వినిపిస్తూ ఉంటారు. అది చాలు. ఇక మరో దక్షిణాది గాయని చిత్రకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్రం.
ఎస్పీబీతో కలిసి బోలెడన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడి, స్వతహాగా కూడా సినీ ప్రియుల్లో బోలెడంత అభిమానాన్ని సంపాదించుకున్న చిత్రకు పద్మభూషణ్ పురస్కారం సముచిత గౌరవం.