కీరవాణి కంపోజిషన్ పై విమర్శల జడివాన

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్నారా? ఆయన చేసిన పని కొత్త విమర్శలకు తావిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. నిన్నంతా కీరవాణిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. దీన్నంతటికీ కారణం…

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్నారా? ఆయన చేసిన పని కొత్త విమర్శలకు తావిస్తోందా? అవుననే అంటున్నారు చాలామంది. నిన్నంతా కీరవాణిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. దీన్నంతటికీ కారణం తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆయన కంపోజ్ చేయడమే.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గీతాన్ని కూడా మార్చింది. కొత్త పాటను కీరవాణితో స్వరపరిచి ఆర్భాటంగా ఆవిష్కరించింది. అందెశ్రీ సాహిత్యం అందించిన ఈ పాటపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఓ వర్గం పనిగట్టుకొని ఈ విమర్శలకు పాల్పడుతోందనే వాదన ఉన్నప్పటికీ, తిట్లు తింటోంది మాత్రం కీరవాణి.

పాత పాటతో పోలిస్తే, తెలంగాణ రాష్ట్ర గీతంలో జీవం లేదని, ఆత్మ లేదని విమర్శిస్తున్నారు కొంతమంది. గీతావిష్కరణ సందర్భంగా అందెశ్రీ భావోద్వేగానికి లోనైనప్పటికీ తమకు అనవసరమని, పాటలో తెలంగాణ ఫ్లేవర్ లేదని అంటున్నారు.

ఓ ఆంధ్రా సంగీత దర్శకుడికి పాటను స్వరపరిచే బాధ్యతను అప్పగించినప్పుడే తెలంగాణ జీవం పాటలో మిస్సవుతుందని తాము భయపడ్డామని, ఇప్పుడదే జరిగిందని మరికొంతమంది విమర్శిస్తున్నారు. పాటలో సంగీతం బాహుబలి నుంచి ప్రేరణ పొందినట్టు కంపోజ్ చేసినట్టుందని, ఇది సినిమా కాదని, తెలంగాణ ప్రజల ఎమోషన్ అని, ఆ భావోద్వేగం పాటలో మిస్సయిందంటున్నారు నెటిజన్లు.

గంగోత్రి సినిమాలోని “గల గల గల గంగోత్రి” పాటను కాపీ కొట్టినట్టుందని కొంతమంది కామెంట్ చేయగా.. పాత పాటలో ఉన్న ఎమోషన్, కొత్త పాట సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ కనిపించలేదని మరికొంతమంది బాధపడ్డారు. కీరవాణికి తను వీరాభిమానినని, కానీ తెలంగాణ రాష్ట్ర గీతం మాత్రం చప్పగా ఉందని ఒకరు కామెంట్ చేశారు.

ఇక సాహిత్యంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు కనిపిస్తున్నాయి. పాత పాటలో ఉన్న పోతన, రుద్రమదేవి, కొమురం భీముడు, కాకతీయ తోరణం, గోల్కొండ కోట.. కొత్త పాటలో ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు చాలామంది. చివరికి సింగరేణి అంశాన్ని కూడా ప్రస్తావించలేదన్నారు.

రాష్ట్ర గీతంలో ఎప్పుడైనా సాహిత్యం సింపుల్ గా ఉండాలని, సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేయకూడదని, అప్పుడే అంతా పాడటానికి సులభంగా ఉంటుందని, కొత్త పాటలో ఆ సరళత్వం లోపించిందని అంటున్నారు మరికొందరు. రాష్ట్ర గీతాల్లో ఎప్పుడూ భారీ సంగీతం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

ఇలా కీరవాణి స్వరపరిచిన పాటపై లెక్కలేనన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు పాటను ఎంతమంది విమర్శిస్తున్నారో, మరోవైపు ఈ పాటను మెచ్చుకుంటున్న వాళ్ల సంఖ్య కూడా అంతే ఉంది