కన్నడ సంజనా ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. నిజానికి నటనతో ఆమె పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియలేదు. డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, జైలుకెళ్లి రావడంతో చిత్ర పరిశ్రమలో ఆమె పేరు మార్మోగింది. దీనికి భాషలు, ప్రాంతాలు అతీతమయ్యాయి. ఇటీవల ఆమె కరోనాబారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఓ చానల్తో పంచుకున్నారు. బెయిల్పై బయటికొచ్చిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో కొత్తదనం చోటు చేసుకుంది. ఆ ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం. ఒక్కోసారి కష్టాలన్నీ ఒకేసారి మాట్లాడుకున్నట్టు దాడి చేస్తుంటాయి. అలాంటి అనుభవమే ఇటీవల తన జీవితంలో సంభవించినట్టు ఆమె చెప్పుకొచ్చారు.
అజీజ్పాషాతో కలిసి ఇటీవల తాను ఏడడుగులు నడిచిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. తను వృత్తిరీత్యా వైద్యుడని, బెంగళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు ఆమె తెలిపారు. అజీజ్, తాను బాల్యమిత్రులని తెలిపారు. తమ మధ్య చిన్నప్పుడే ఏర్పడిన స్నేహం పెద్దయిన తర్వాత ప్రేమకు దారి తీసిందన్నారు. కొంత కాలం ఇద్దరం డేటింగ్లో ఉన్నామన్నారు. అయితే ఇదంతా రహస్యంగానే సాగిందన్నారు.
డ్రగ్స్ కేసులో తాను గత ఏడాది జైలుకి వెళ్లినప్పుడు అజీజ్పాషా, అతని కుటుంబం ఎంతో అండగా నిలిచిందన్నారు. బెయిల్పై బయటకు రాగానే అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో తమ వివాహం జరిగిందన్నారు. ప్రస్తుతం అజీజ్ ప్రతిరోజూ ఆస్పత్రికి వెళ్లి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. తన ఆందోళన అంతా అజీజ్ గురించే అని ఆమె చెప్పుకొచ్చారు.
నూతన సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశించిన తనకు తాత్కాలిక నిరాశ ఎదురైందన్నారు. దీనికి కారణం తాను కరోనాబారిన పడడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే త్వరలో తాను కరోనా నుంచి బయటపడతానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.