బాలయ్య టాక్ షోకు చిరంజీవి ఎందుకు రాలేదు?

బాలయ్య టాక్ షో మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఈ కార్యక్రమానికి చిరంజీవి వస్తారా రారా అనే చర్చ ఓవైపు నడుస్తూనే ఉండగా, మరోవైపు బాలయ్య టాక్ షో సీజన్-1…

బాలయ్య టాక్ షో మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఈ కార్యక్రమానికి చిరంజీవి వస్తారా రారా అనే చర్చ ఓవైపు నడుస్తూనే ఉండగా, మరోవైపు బాలయ్య టాక్ షో సీజన్-1 పూర్తయింది. చిరంజీవి లేకుండానే ఓ సీజన్ ముగిసింది. ఇంతకీ బాలయ్య టాక్ షోకు చిరు ఎందుకు రాలేదు? ఆహా టీమ్ చిరంజీవి కోసం ప్రయత్నం చేయలేదా? అల్లు అరవింద్ లైట్ తీసుకున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అన్ స్టాపపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి సమాధానం ఇచ్చాడు.

“బాలయ్య, చిరంజీవితో టాక్ షో అంటే దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. అదంతా మేం స్టార్ట్ చేశాం కూడా. చిరంజీవి గారి ఎంట్రీ కంటే ముందు నుంచే బాలయ్య ఉన్నారు. చిరంజీవితో పోలిస్తే వయసులో బాలయ్య చిన్నవాడు, కానీ సీనియారిటీలో పెద్దవాడు. ఈ మేజిక్ ను రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం. దానికి సంబంధించి వర్క్ కూడా జరిగింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రెండో సీజన్ బాలయ్య-చిరంజీవి టాక్ షోతోనే ఓపెన్ అవ్వొచ్చు.”

ఇలా బాలయ్య-చిరంజీవి టాక్ షోపై స్పందించాడు బీవీఎస్. కేవలం డేట్స్ సెట్ అవ్వక చిరంజీవి రాలేకపోయారని, అంతకుమించి రాజకీయ, సామాజిక కారణాలేం లేవని క్లారిటీ ఇచ్చాడు.

“చిరంజీవి గారిని ఆల్రెడీ అడిగాం. ఈ సీజన్ కు కుదరలేదు. నెక్ట్స్ సీజన్ కు తప్పకుండా వస్తారు. ఆయన బాలయ్య టాక్ షోకు ఇప్పటివరకు రాకపోవడానికి రాజకీయ, సామాజిక కోణాల్లో కారణాలేం లేవు. గాడ్ ఫాదర్, భోళాశంకర్, దర్శకుడు బాబి సినిమా, ఆచార్య డబ్బింగ్ తో బిజీగా ఉన్నారు. ఇవి కాకుండా మరోవైపు రాజకీయ చదరంగం నడుస్తోంది. ఇంత బిజీగా ఉండడం వల్లనే ఆయన రాలేకపోయారు. ఈసారి తప్పకుండా వస్తారు.”

మరోవైపు ఇదే టాక్ షోకు బాలయ్య సమకాలీకులు నాగార్జున, వెంకటేష్ కూడా హాజరుకాలేదు. వెంకటేష్ ఓ వెబ్ సిరీస్ తో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారట. ఇక నాగార్జునను మాత్రం తాము ఇంతవరకు ట్రై చేయలేదని క్లారిటీ ఇచ్చాడు బీవీఎస్ రవి.