శ్రీనువైట్ల పాలిట ‘బంగారు’కొండ?

సినిమా లాక్ చేసుకోలేక ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఒకప్పుడు స్టార్ హీరోలతో పనిచేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల్ని కూడా తన కథలతో ఒప్పించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు…

సినిమా లాక్ చేసుకోలేక ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఒకప్పుడు స్టార్ హీరోలతో పనిచేసిన ఈ దర్శకుడు, ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల్ని కూడా తన కథలతో ఒప్పించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు సినిమా ఎనౌన్స్ చేయడం, అది వెనక్కు వెళ్లిపోవడం వైట్ల కెరీర్ లో ఆనవాయితీగా మారింది.

ఇప్పుడీ దర్శకుడి లిస్ట్ లోకి బెల్లంకొండ ఎంటరయ్యాడు. రీసెంట్ గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్, వైట్ల మధ్య కథాచర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఎనౌన్స్ మెంట్ ఉంటుంది.

అయితే ప్రాజెక్ట్ లాక్ అయినా, వైట్లకు వెయిటింగ్ తప్పకపోవచ్చు. ఎందుకంటే, ప్రస్తుతం హిందీ ఛత్రపతి పనుల్లో ఈ హీరో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ కు ఓ సినిమా చేయాలి. ఈ రెండు ప్రాజెక్టులు కొలిక్కి వచ్చిన తర్వాతే కేకే రాధామోహన్ నిర్మాతగా వైట్ల ప్రాజెక్టు సెట్స్ పైకి వస్తుంది.

గతంలో మంచు విష్ణుతో ఓ సినిమా ప్రకటించాడు వైట్ల. అంతా సెట్ అనుకున్న టైమ్ లో ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ లేదు. అంతకంటే ముందు అఖిల్ తో సినిమా అనుకున్నారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు. మధ్యలో గోపీచంద్ లాంటి మరో ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు తెరపైకొచ్చినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. కనీసం బెల్లంకొండ అయినా వైట్ల పాలిట బంగారుకొండగా మారుతాడేమో చూడాలి.