ఒకవైపు లోక్ సభ సమావేశాలకు సమయం ఆసన్నం అవుతూ ఉండగా.. ఎంపీలకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడి అవుతున్నట్టుగా తెలుస్తోంది. లోక్ సభ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లి పలువురు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా తెలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 24 మంది ఎంపీలకు, మరో ఎనిమిది మంది కేంద్రమంత్రులకు ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా సమాచారం!
ఏపీకి చెందిన వారిలో కూడా ముగ్గురు ఎంపీలకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా వార్తలు వస్తున్నాయి. వంగా గీత, గొడ్డేటి మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలకు కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా వార్తలు వస్తున్నాయి. వీళ్లు స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా తేలారని సమాచారం.
ఏకంగా ఇంతమంది ఎంపీలు, కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో.. సమావేశాల నిర్వహణ ఎలా జరుగుతుందనేది విశేషంగా మారింది. ఎంపీలందరికీ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని, స్వల్ప లక్షణాలు ఉన్న వారికి కూడా సభలోకి ప్రవేశం లేదని లోక్ సభ స్పీకర్ ప్రకటించారట. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇంతమందికి పాజిటివ్ గా తేలడం, ఇంకా ఎవరెవరి పరిస్థితి ఏమిటో అనే సహజమైన ఆందోళన.. మిగతా ఎంపీలను కూడా ఆందోళనకు గురి చేయడం విచిత్రమేమీ కాదు.