చేసే పని ఏదైనా హూందాగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే దానికో గౌరవం, మర్యాద ఉంటాయి. కానీ రాజధాని పేరుతో కొందరు మంగళవారం వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ల తీరు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవడానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు కలిసేందుకు అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి సురేష్తో పాటు మరికొందరు విజయవాడకు చేరుకున్నారు.
కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ఉండవల్లిలోని గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్కు వాళ్లంతా చేరుకున్నారు. ఈ విషయం తెలిసి కొందరు మహిళలు రాజధాని పేరుతో అక్కడికి వెళ్లి ఆందోళనకు దిగారు.
‘మూడు రాజధానులు వద్దు రాజధానే ముద్దు’ అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా చేపట్టిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
అయితే ఐదారుగురు టాలీవుడ్ ప్రముఖులు సీఎంను కలవడానికి వస్తే…వారు బస చేస్తున్న గెస్ట్హౌస్ ఎదుట రాజధాని పేరుతో ఆందోళనకు దిగడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం ప్రచారం కోసం ఇలాంటి ఛీప్ ట్రిక్స్ ప్లే చేయడం మినహా…ఇలాంటి కార్యకలాపాల వల్ల ఒరిగేదేమీ లేదని పలువురు అంటున్నారు. జగన్ను చిరంజీవి, నాగార్జునతో పాటు దర్శకులు, నిర్మాతలు కలవడం ఇష్టం లేని రాజకీయ పార్టీ ఎత్తుగడలో భాగంగానే దీన్ని చూడాలని కొందరంటున్నారు.