ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో రాష్ట్ర హై కోర్టులో మరో పిటిషన్ దాఖలు అయ్యింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి హై కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకునే ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం, మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి, కొత్తగా మాజీ జడ్జిని ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిన సంగతే. ఆ ఉత్తర్వులను రాష్ట్ర హై కోర్టు కొట్టి వేసింది. స్టేట్ ఈసీ నియామకం విషయంలో కేబినెట్ జోక్యం ఉండకూడదని, ఈ విషయంలో గవర్నరే పూర్తి విచక్షణాధికారంతో నియామకం చేపట్టాలని చెబుతూ హై కోర్టు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేసిందట. ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకే నియమితం అయిన నిమ్మగడ్డ రమేష్ నియామకం ఎలా చెల్లుతుంది? అనేది ఒక ధర్మసందేహం.
ఏదైనా నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసినట్టు అయితే, అప్పుడు పదవిలో ఉన్నవారి నియామకం రద్దు కావడం సహజం. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు గవర్నర్ చేత నియమితం అయిన వారనేది పిటిషనర్ వాదన. హై కోర్టు తీర్పు ప్రకారం.. నిమ్మగడ్డ నియామకం చెల్లదని, గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ సిఫార్సు మేరకు ఆయన నియామకం జరిగింది కాబట్టి, ఆ నియామకాన్ని పూర్తిగా రద్దు చేయాలని, స్టేట్ ఈసీగా ఇకపై నిమ్మగడ్డ వ్యవహరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హై కోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది. హై కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారమే.. నిమ్మగడ్డ నియామకం చెల్లదు అనేది ఈ పిటిషనర్ చేస్తున్న ప్రముఖమైన వాదన.