అమరావతి ఉద్యమం మరుగున పడింది. పీఆర్సీపై అసంతృప్తితో ఒక వైపు ఉద్యోగుల ఆందోళన, మరోవైపు జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశాలు తెరపైకి వచ్చాయి. దీంతో అమరావతిలోనే పరిపాలన రాజధాని కొనసాగించాలనే ఉద్యమం ఎవరికీ పట్టడం లేదు.
చివరికి రెండేళ్లుగా ఆ ఉద్యమాన్ని మోస్తున్న ఎల్లో మీడియాకు కూడా అంత ప్రాధాన్యం అంశం కాకుండా పోయింది. కొత్త ఉద్యమాలు, అంశాలు తెరపైకి రావడంతో అమరావతిది పాత ఉద్యమమై, ఆకర్షణ కోల్పోయింది.
జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చినప్పటి నుంచి అమరావతి పరిధిలోని ఆ 29 గ్రామాలకు చెందిన వారు ఏదో రకంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పేరుతో తిరుమలకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు హెచ్చరించారు.
రాష్ట్ర నలుమూలలకు అమరావతి ఉద్యమాన్ని తీసుకెళతామని ప్రతిజ్ఞ చేశారు. అయితే వారి మాటల్లో ఆరంభ శూరత్వమే తప్ప ఆచరణ లేదు. ప్రస్తుతం అమరావతి రైతుల ఉద్యమం సంగతేంటో ఎవరికీ తెలియడం లేదు. అసలు ఆ ఊసే లేకుండా పోయింది.
ఎల్లో చానళ్లలో అమరావతిపై ఉద్యమం మాట ఎత్తక రోజులవుతోంది. ఇలాగే కొనసాగితే తమ ఉద్యమాన్ని జనం మరిచిపోతారేమో అనే ఆందోళన వారిలో నెలకుంది. కాలం అన్నింటికి సమాధానం చెబుతుందంటే ఇదే కాబోలు. కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారనే వాస్తవాన్ని…. ఉద్యోగుల నిజమైన ఉద్యమం నిరూపించింది.