అజారుద్దీన్ కాంగ్రెస్ కు గుదిబండ అవుతారా?

స్కిప్పర్ అజాహరుద్దీన్ తన అద్భుతమైన పాటవంతో.. కాంగ్రెస్ పార్టీకి ఎడ్వాంటేజీగా మారనున్నారా? లేదా తన చేతివాటం పుణ్యమాని ఆ పార్టీకి గుదిబండగా మారి ముంచేయబోతున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. Advertisement…

స్కిప్పర్ అజాహరుద్దీన్ తన అద్భుతమైన పాటవంతో.. కాంగ్రెస్ పార్టీకి ఎడ్వాంటేజీగా మారనున్నారా? లేదా తన చేతివాటం పుణ్యమాని ఆ పార్టీకి గుదిబండగా మారి ముంచేయబోతున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

పీజేఆర్ కుమారుడు విష్ణువర్దన్ రెడ్డిని కాదని, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెసు పార్టీ అజాహరుద్దీన్ ను అభ్యర్థిగా పరిగణిస్తోంది. అయితే.. జూబ్లీ హిల్స్ లో అజార్ గెలుస్తారో లేదో తర్వాతి సంగతి! కానీ అజార్ కు ఈ ప్రాధాన్యం ఇవ్వడం అనేది యావత్తు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి చేటు చేస్తుందా? అనే అభిప్రాయం ఇప్పుడు పలువురిలో వ్యక్తం అవుతోంది. అజారుద్దీన్ కు అంటుకున్న అవినీతి మరకలు, కాంగ్రెసు పార్టీ క్రెడిబిలిటీకి కూడా నష్టం చేస్తాయని, విశ్వసనీయతను దెబ్బకొడతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజాహరుద్దీన్ సంస్థ నిధులను స్వాహా చేశారని, అనేకానేక గోల్ మాల్ లకు పాల్పడ్డారని కేసులు నమోదు కావడం ఇప్పుడు కేవలం క్రికెట్ అనుబంధ వర్గాలలో మాత్రమే కాదు, యావత్ రాజకీయ వర్గాల్లోనే సంచలనం నమోదు చేస్తోంది. 

హైదరబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి అనేకానేక ఆరోపణలున్నాయి. హెచ్‌సిఏ వ్యవహారం సుప్రం కోర్టుకు చేరడంతో  జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని నియమించారు. ఆ కమిటీనే ఇప్పుడు అక్కడ భారీగా కుంభకోణం, నిధుల స్వాహా జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.హెచ్‌సిఏకు సారథ్యం వహించిన మహ్మద్ అజహరుద్దీన్, ఆయనతోపాటు జాన్ మనోజ్, విజయానంద్ ల మీద కూడా కేసు నమోదు చేశారు.

లావు నాగేశ్వరరావు కమిటీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలపై దర్యాప్తు చేయడం మొదలైన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. హెచ్‌సీఏ ఎన్నికల్లో అజార్ పోటీచేయకుండా అనర్హత వేటు వేశారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా రెండు హెచ్ సిఏతో పాటు మరో క్లబ్ కు అధ్యక్షుడుగా ఉన్నందువలన.. చివరికి హెచ్‌సిఏ ఎన్నికల్లో ఆయన ఓటుహక్కును కూడా తొలగించారు. ఇలా అవినీతి మరకలను ఒళ్లంతా పులుముకుని ఉన్న అజారుద్దీన్ ను శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలనుకుంటోంది.

ఈ నియోజకవర్గం నుంచి.. పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డికి , అజార్ కు మద్య టికెట్ వార్ నడుస్తోంది. పార్టీ అధిష్ఠానం తనకు ముందే సూచనలు చేసినదంటూ.. నియోజకవర్గ పరిధిలో కొన్నాళ్లుగా అజార్ పర్యటనలు కూడా చేస్తున్నారు. వీటిని విష్ణు వర్గీయులు అడ్డుకోవడంతో రభస కూడా జరిగింది. అయితే ఇప్పుడు అజార్ మీద ఇలాంటి అవినీతి కేసులు నమోదైన నేపథ్యంలో కాంగ్రెస్ ఆలోచన ఎలా సాగుతుందో వేచిచూడాలి. 

అజార్ కు టికెట్ ప్రకటిస్తే.. అవినీతిపరులను నెత్తిన పెట్టుకుంటున్న పార్టీగా, కాంగ్రెసు మీద ఎన్నికల ప్రచారంలో భారాస విరుచుకుపడుతుందనడంలో సందేహం లేదు. నిజం చెప్పాలొంటే.. అజారుద్దీన్ ను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం కూడా, ఈ సమయంలో, కాంగ్రెస్ కు నష్టమే చేస్తుందని కొందరంటున్నారు. అందుకే అజార్ కు కాంగ్రెస్ కు గుదిబండగా మారుతారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.