జగన్-మొండితనంతో కూడిన నిర్ణక్ష్యం

వైఎస్ జగన్ గురించి ఆయన అనుకూల జనాలు చాలా ఎలివేషన్లు ఇస్తుంటారు. సదా రాజకీయమే ఆలోచిస్తూ వుంటారని, ప్రత్యర్ధులు ఆయన ఎత్తుగడలు పసిగట్టలేరని అంటున్నారు. అది ఎంత వరకు నిజమో అన్నది ఒక్కోసారి అనుమానం…

వైఎస్ జగన్ గురించి ఆయన అనుకూల జనాలు చాలా ఎలివేషన్లు ఇస్తుంటారు. సదా రాజకీయమే ఆలోచిస్తూ వుంటారని, ప్రత్యర్ధులు ఆయన ఎత్తుగడలు పసిగట్టలేరని అంటున్నారు. అది ఎంత వరకు నిజమో అన్నది ఒక్కోసారి అనుమానం కలుగుతూ వుంటుంది.

ఇటీవల ఎడా పెడా మారుస్తున్న నియోజకవర్గ ఇన్ చార్జ్‌ల తీరు చూస్తుంటే ఈ అనుమానం బలంగా కలుగుతూంది. నియోజక వర్గ ఇన్ చార్జ్ అంటే బై డీఫాల్ట్ గా అక్కడ వైకాపా తరపున పోటీ చేసే అభ్యర్థి అన్నది బలంగా వున్న అర్థం. ఇది జగన్ కనిపెట్టిన కొత్త పద్దతి. ఎన్నికలకు ముందుగానే నియోజక వర్గ ఇన్ చార్జ్ లుగా నియమించడం, వారి పనితీరు, వారి పట్ల జనం స్పందన బాగుంటే వారికి టికెట్ ఇవ్వడం ఇదీ పద్దతి. ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా అదే దోవన పోతున్నాయి. అది వేరే సంగతి.

అయితే ఇలా ఒకసారి నియోజక వర్గం ఇన్ చార్జ్ పదవి ఇచ్చాక మరీ వారం, పది రోజులు కూడా దాటకుండానే మార్చేయడం, తాను అనుకున్న వారి మనోగతం తెలుసుకోకుండా ఇవ్వడం, వారు పార్టీ వదిలిపోవడం, ఒకసారి ఇచ్చిన వారిని మార్చేస్తే వాళ్లు అలగడం, ఇవన్నీ కలిసి ఓ ప్రహసనంగా మారుతున్నాయి. పైగా ప్రతిపక్ష మీడియా బలంగా వుంది. గోరంతలు వుంటేనే కొండంతలు చేసి చూపిస్తుంది. అలాంటిది ఇలా అవకాశం ఇస్తే ఇంకా రెచ్చిపోతుంది.

తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు పైకి తీసుకురాదు కానీ వైకాపా గొడవల మీద భూతద్దం పెడుతుంది. అనకాపల్లిలో పీలా గోవింద్ అలిగిన మౌనం వహించినా, ఆయన వర్గం నానా హడవుడి చేసినా ఎల్లో మీడియాకు పట్టదు. అదే వైకాపా సంగతులు అయితే చెప్పనక్కరలేదు.

ఇవన్నీ తెలిసి కూడా జగన్ అస్సలు జాగ్రత్తగా వుండడం లేదు. అసలు జగన్ వైఖరినే కేర్.. నాట్ అనే పద్దతి. ఎవరు వెళ్లిపోతే వెళ్లిపోండి. ఎవరు దూరం అయితే కానివ్వండి. ఎవరు ఎలా రాసుకుంటే అలా రాసుకోండి. నాకు జనం వున్నారు… అనుకుంటారు. కానీ జనం ఎక్కడి నుంచో దిగిరాలేదు. ఈ నాయకులు అంతా కలిసి తెస్తేనే జనం వస్తారు. ఆ సంగతి జగన్ కు తెలియదని అనుకోవాలా.

పోనీ ఆ సంగతి అలా వుంచుదాం. వారానికి ఓ ఇన్ చార్జ్ ను మారుస్తూ వుంటే పార్టీ కార్యకర్తలు ఎవరి వెంట వుండాలి? ఎన్నికల టైమ్ లో కార్యకర్తలను వెంట వుంచుకోవాలి అంటే రోజుకు లక్షల్లో ఖర్చు. వారం రోజులు ఈ ఖర్చు పెట్టుకున్నాక, తూచ్.. నువ్వు కాదు వేరే వాళ్లు అంటే అప్పటి దాకా ఖర్చు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి? పోనీ డబ్బు సంగతి అలా వుంచుదాం. జనాల్లో పరువు పల్చనైపోదా?

నెల్లూరు నుంచి వేమిరెడ్డి తప్పుకున్నారు అనుకుందాం, మరొకరి రేపు అర్జంట్ గా పెట్టడానికి తొందరెందుకు? విజయసాయి పేరును ప్రకటించారు. నిజంగా విజయసాయి అక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితి వుందా? మళ్లీ మార్చాల్సి వుంటే ఇలా చేస్తూ వుండడం నామర్దా కాదా?

మంగళగిరి సంగతి మరీ చిత్రం. వేరే పార్టీ నుంచి తీసుకువచ్చేటపుడే ఆలోచించాలి. అక్కడ లోకేష్ తెలుగుదేశం అభ్యర్థి అన్నది ఫిక్స్. అది తెలిసి కూడా రోజుకు ఓ అభ్యర్థిని మారుస్తూ వుంటే ఏమిటి అనుకోవాలి.

జగన్ ఆలోచనా విధానం ఒకటే. జనం ఓట్లు వేస్తే తనను చూసి వేస్తారు. లేదంటే మానేస్తారు. అభ్యర్ధులు అంతా నామ మాత్రం. ఇదే ఆయన ఆలోచన. కానీ ఆయన తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మేనేజ్ మెంట్ అనేది ఒకటి వుంటుంది. అది చేయడం కోసమైనా లోకల్ గా సరైన వాళ్లు కావాలి. ఇది ఇవ్వాల్టి, నిన్నటి పద్దతి కాదు. యాభై ఏళ్లకు పైగా ఇదే జరుగుతోంది. ఎంత వేవ్ లో కూడా ఎదురీది గెలిచేవారు వుంటారు. ఓడే వారు వుంటారు. అంటే ఏమిటి అర్థం. కేవలం పార్టీ, పార్టీ నేత అన్నది మాత్రమే సరిపోదు అనే కదా.

మరి జగన్ కు నిజంగా రాజకీయ పరిణితి వుంటే ఇలా చేస్తారా? చిన్నపిల్లాడు బొమ్మలతో ఆడుకుని బోర్ కొట్టినపుడల్లా వాటిని మార్చేసినట్లు, కేండిడేట్ లను మార్చేస్తే ఎలా? వాళ్లకు కూడా మనోభావాలు వుంటాయి. జనాల్లో గౌరవ మర్యాదలు వుంటాయి..అనుచరులు వుంటారు. ఈ సంగతి జగన్ పూర్తిగా విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది వాళ్లను గడ్డి పోచలు అనుకుంటున్నారేమో.. అవన్నీ కలిస్తే బలం చాలా ఎక్కువగా వుంటుంది.

ప్రస్తుతం జగన్ ఆలోచనా విధానం, అవలంబిస్తున్న పద్దతి చూస్తుంటే.. దాన్ని నిర్వచించాలి అనుకుంటే… మొండితనంతో కూడిన లెక్కలేనితనం, లేదా నిర్లక్ష్యం అని అనాల్సి వస్తోంది.