చంద్రబాబుతో పొత్తు కేసీఆర్ చేతికి బ్రహ్మాస్త్రమే!

తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి కేసీఆర్ ను ఓడించి, అధికారంలోకి రావడం తమకు అసాధ్యం అనే భావన భారతీయ జనతా పార్టీలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వారికి సమానమైన బలం లేకపోవడమే అందుకు కారణం.  Advertisement…

తెలంగాణలో ఒంటరిగా పోటీచేసి కేసీఆర్ ను ఓడించి, అధికారంలోకి రావడం తమకు అసాధ్యం అనే భావన భారతీయ జనతా పార్టీలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వారికి సమానమైన బలం లేకపోవడమే అందుకు కారణం. 

బలహీనతల గురించి అందరికంటె వారికే బాగా తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు గనుక.. రాష్ట్ర నాయకులు ఎంత హడావుడి చేసినప్పటికీ.. బలహీనతలపై వారికి స్పష్టత ఉన్నది గనుకనే.. ఇతర పార్టీల నుంచి నాయకులను ఫిరాయింపజేసుకోవడం కోసం.. ప్రత్యేకంగా రాష్ట్ర కార్యవర్గంలో ఒక ‘చేరికల కమిటీ’ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 

రిజల్టు పెద్దగా లేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఈ చేరికల కమిటీ ఎరకు లొంగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పొత్తు ద్వారా కొంత అదనపు క్షేత్రస్థాయి బలం చేకూరుతుందని బిజెపి అధిష్ఠానం ఆశపడడం తప్పు కాదు.

అయితే పొత్తు గురించిన వార్తలన్నీ ఊహాగానాలే అని బండిసంజయ్ లాంటి వారు కొట్టిపారేస్తున్నారు. బండి విముఖత సంగతి ఎలా ఉన్నప్పటికీ.. గులాబీదళంలో మాత్రం.. ఈ పొత్తు గురించి ఆనందం వ్యక్తం అవుతోంది.

చంద్రబాబునాయుడు అంటేనే ఒంటికాలిపై లేచే కేసీఆర్ కు, తెలుగుదేశంతో భాజపాతో పొత్తు పెట్టుకోవడం అనేది బ్రహ్మాస్త్రంలాగా అందివస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

2018 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాహుల్ తో కలిసి రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఏ ‘కాంగ్రెస్ వ్యతిరేకత’ అనే ఎజెండా తమ మూలాల్లో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో.. ఆ కాంగ్రెస్ తోనే ఆయన అంటకాగారు. 

అయితే ఆ సమయంలో ఎన్నికల ప్రచార సభలో.. ఈ మైత్రీ బంధాన్ని కేసీఆర్ ఒక రేంజిలో ఆడుకున్నారు. ఆయన ఫోకస్ పూర్తిగా చంద్రబాబు మీదనే సాగిపోయింది. అది వారికి వర్కవుట్ అయింది కూడా. తెలుగుదేశానికి పుట్టగతులు లేకుండా పోగా, వారితో కొత్త బంధం ముడివేసుకున్నందుకు కాంగ్రెస్ కూడా నామరూపాలు లేకుండాపోయింది. కేవలం తెలుగుదేశం పొత్తువల్ల మాత్రమే తమ పార్టీ నష్టపోయిందని.. ఓటమి తర్వాత.. పోస్టుమార్టం నివేదికల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అనే అదే పనిని రిపీట్ చేస్తోంది. ఈ పొత్తు కుదిరేదాకా కేసీఆర్ సైలెంట్ గా ఉంటారని, పొత్తు ప్రకటన జరిగి, సీట్లు పంచుకున్న తర్వాత.. ఈ పొత్తు గురించి విమర్శలతో తన విశ్వరూపం చూపిస్తారని ఆయన పార్టీ వారే చెబుతున్నారు. 

చంద్రబాబు మీద విరుచుకుపడడంలో కేసీఆర్ ఉధృతికి భాజపా కూడా వారికి అంతో ఇంతో బలం ఉన్న చోట్ల కూడా నష్టపోయే పరిస్థితి వస్తుందని వారంటున్నారు. ఏం జరుగుతుందో వేచిచూడాలి.