‘కొణిదెల’బ్రదర్స్ కు నో క్లారిటీ!

చంద్రబాబు పోటీ చేసే నియోజక వర్గం, జగన్, లోకేష్ పోటీ చేసే నియోజక వర్గాలు అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే చాలా మంది నాయకులు పోటీ చేస్తున్న, లేదా ఆశిస్తున్న నియోజక వర్గాలు…

చంద్రబాబు పోటీ చేసే నియోజక వర్గం, జగన్, లోకేష్ పోటీ చేసే నియోజక వర్గాలు అందరికీ తెలుసు. ఆ మాటకు వస్తే చాలా మంది నాయకులు పోటీ చేస్తున్న, లేదా ఆశిస్తున్న నియోజక వర్గాలు అందరికీ తెలుసు. కానీ కొణిదెల బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది క్లారిటీ లేదు. ఫలానా చోట నుంచి అని టాక్ తప్ప, అధికారికంగా ఈ రోజు వరకు ప్రకటించలేదు. వెస్ట్ గోదావరి నుంచి కొణిదెల బ్రదర్స్ ఎవరు పోటీ చేసినా ఓటమి చవిచూసారు. చిరు, పవన్, నాగబాబు ది ఇదే అనుభవం. అందుకే ఇక జిల్లా తమకు అచ్చిరాదని డిసైడ్ అయినట్లున్నారు.

నాగబాబు అనకాపల్లికి వలస వెళ్తున్నారు అని వార్తలు వచ్చాయి. వార్తలు రావడమే కాదు, పవన్ స్వయంగా రెండు సార్లు వెళ్లి కొణతాలను పార్టీలోకి తీసుకువచ్చి, అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నాగబాబు అక్కడే వుంది తిరుగుతూ తన పనులు తాను చేయడం ప్రారంభించారు. అందరినీ పిలిచి మాట్లాడడం ప్రారంభించారు. ఇంతలో జనసేన తొలి జాబితా వచ్చింది. దాని మీద పార్టీ వర్గాల్లో, అభిమానుల్లో రకరకాల స్పందనలు. దాంతో నాగబాబు దాదాపు సైలంట్ అయిపోయారు.

ఇదిలా వుంటే పవన్ తన పోటీ కోసం పిఠాపురం ఎంచుకున్నారని, అక్కడికి దగ్గరలో హెలిపాడ్ ఏర్పాటు కూడా చేసుకున్నారని వార్తలు వచ్చేసాయి. దీంతో అక్కడి తెలుగుదేశం వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. మాజీ ఎమ్మెల్యేె వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని వార్తలు వినిపించడం ప్రారంభమైంది. దాంతో దాన్ని కూడా అబేయన్స్ లో పెట్టినట్లు కనిపిస్తోంది.

అన్నదమ్ములు ఇద్దరూ ఓ జిల్లా నుంచి పోటీ చేయకూడదని అనుకుంటున్నారు. అలాగే వెస్ట్ గొదావరి అచ్చిరావడం లేదని క్లారిటీ వచ్చింది. ఇక మిగిలిది విశాఖ, ఈస్ట్ గోదావరి జిల్లాలు. ఎక్కడ నుంచి పోటీ అన్నా ఏదో సమస్య కనిపిస్తోంది. అందువల్ల ప్రస్తుతానికి అయితే పవన్, నాగబాబు పోటీ చేసే స్థానాల విషయంలో క్లారిటీ లేదు. అసలు ఇద్దరూ పోటీ చేస్తారా, లేక నాగబాబు మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసి, పవన్ రాజ్య సభ మార్గం ఎంచుకుంటారా? అన్నది కూడా అనుమానం.

జగన్ కు టన్నుల కొద్దీ భయం చూపిస్తా అన్నది పవన్, అసలు ఎక్కడ పోటీ చేయాలో? చేయగలరో లేదో క్లారిటీ ఇవ్వడానికే భయపడుతున్నారు. చిత్రం కదా?