Advertisement

Advertisement


Home > Politics - Analysis

మహా నగరంలో మాయగాళ్లు : మహా ప్రముఖులను ఇరికించారు..!

మహా నగరంలో మాయగాళ్లు : మహా ప్రముఖులను ఇరికించారు..!

హైదరాబాద్ లో మరో చీకటి వ్యవహారం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. పత్తాలాటతో కోట్లు సంపాదిస్తున్న చీకోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్‌లో 8 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. టూరిజం ప్యాకేజీ పేరుతో విదేశాలకు తీసుకెళ్ళి మరీ పేకాట ఆడించే చీకోటి ప్రవీణ్ చీకటి కోణం తెరపైకి వచ్చింది. 

అవును క్యాసినో కింగ్ ప్రవీణ్‌.. క్యాసినో మాస్టర్ మాధవరెడ్డి.. ఈ ఇద్దరి ఇళ్లు, ఫామ్ హౌసులు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మొత్తం ఆరు చోట్ల. సీఆర్పీఎఫ్‌ జవాన్ల భద్రతా ఏర్పాట్లతో ఈ తనిఖీలు నిర్వహించారు. ఇరువురూ భారీ ఎత్తున మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని ఈ దాడుల్లో గుర్తించారు అధికారులు. అంతేకాదు ఈ చీకటి కోణానికి సంబంధించిన కీలక పత్రాలను సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఈ ఇద్దరు పత్తాలాటను ఎంతో రాయల్ గా నిర్వహిస్తారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటీశ్వరులకు ఎరవేసి మరీ.. భారీ ఎత్తున క్యాసినో టూరిజం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దేశ విదేశాల్లో టూర్లను ఏర్పాటు చేస్తారు. గోవాతో పాటు నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మలేషియా వంటి విదేశీ ట్రిప్పులున్నాయని గుర్తించారు. ఒక్కసారి ల్యాండయితే.. అక్కడ పేకాటరాయుళ్లను అలరించడానికి బాలీవుడ్ సెలబ్రిటీస్ సైతం వస్తారనీ.. మీతో కలసి క్యాసినోలో.. పాల్గొంటారనీ.. ప్రచారం చేస్తారు. 

అంతేకాదు అందుకు సినీ సెలబ్రెటీలతో ఉన్న సెల్ఫీలను, వీడియోలను చూపిస్తారు. విదేశాలకు వెళ్లాక, 20కి పైగా.. ఉన్న ఆటలకు సంబంధించి టోకెన్లను ఇస్తారు. వీటిలో ఎవరి స్థాయికి వారు ఆటలాడుతారు. కొందరు పోగొట్టుకుంటారు. మరి కొందరు జాక్ పాట్ కొడతారు. ఇలాంటి వారితో ట్రాన్సాక్షన్స్ నడపడంలో.. హవాలా పద్ధతిని పాటిస్తారని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కోట్లాది రూపాయల వీరి లావాదేవీల్లో అవకతవకలు గుర్తించి.. తర్వాత చర్యలు చేపట్టనున్నారు.

హైదరాబాద్, గుంటూరు విజయవాడకు చెందిన వ్యక్తులను క్యాసినో ఆడేందుకు రప్పిస్తారు. క్యాసినోకి హీరోయిన్లు వస్తారని వారిని రెచ్చగొట్టి తీసుకెళ్తారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించడం అంతా వీరిద్దరే చూసుకుంటారు. ఈ మొత్తం క్యాసినో నిర్వహణ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు దాసరి మాధవరెడ్డి, చీకోటి ప్రవీణ్. పత్తాలాటలో వారానికి రూ.20లక్షల సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ప్రవీణ్ కు బాలీవుడ్, టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోలు, హీరోయిన్లూ స్నేహితులే.. ఈ మూడు ముక్కలాట కోసం ఏకంగా నేపాల్, ఇండినేసియా, శ్రీలంకలో క్యాసినో కేంద్రాలకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తారు.

క్యాసినోకు ముందు సినీ తారలతో చీకోటి ప్రమోషన్ వీడియోలు తీసి వదులుతాడు. ఇదంతా సీక్రెట్‌గా జరుగుతుంది. వారి వాట్సాప్‌ గ్రూపుల్లోనే ప్రమోషన్లు జరుగుతాయి. ఇటీవల నేపాల్‌లో జరిగిన క్యాసినోలకు 10 మంది టాలీవుడ్, బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ హాజరైనట్లు తెలుస్తోంది. వారిలో అమీషా పాటేల్ ,మేఘననాయుడు, విల్సన్, గోవింద, ముమైత్‌ఖాన్, మల్లికాషెరావత్, సింగర్ జాన్సీరాజు ఉన్నట్లు వెల్లడైంది. సినీ తారల పేమెంట్లపై ఆరా తీశారు ఈడీ అధికారులు.

ప్రవీణ్ మొదట్లో హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌ల నిర్వహణ చేసేవాడు. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్‌, జూబ్లీహిల్స్‌లో.. సెలబ్రిటీల కోసం క్యాసినో దందాను నిర్వహించేవారు. గోవాలో గో డాడీ క్యాసినోలో పార్ట్‌నర్‌ గా మారి.. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో జోరుగా దందా సాగిస్తున్నాడు. లీడర్ల అండదండలతో విదేశాలకు విస్తరింపజేశాడు. ఒక్కో వీకెండ్‌కి రూ.40లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. బంగారం దందా వ్యవహారంలోనూ సంబంధాలున్నట్లు గుర్తించారు. దీంతో హవాలా ద్వారా నగదు లావాదేవీలతో ఈడీ ఫోకస్‌ పెట్టింది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతో చికోటికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చీకోటి అండ్‌ మాధవరెడ్డి.. నెలలో నాలుగు,ఐదు రోజులు క్యాషినో నిర్వాహణ చేస్తున్నట్లు విచారణలో బయటికొచ్చింది. వీఐపీ, వీవీఐపీలతో కాంటాక్ట్స్‌.. వారిని క్యాసినోలకు రప్పించడం.. అన్ని వ్యవహారాలు చూసుకోవడం, క్యాసినో పేరుతో వారి నుంచి అవసరమైనంత గుంజేయడం జరుగుతోంది. అటు వీఐపీలు కూడా డబ్బు పోగొట్టుకున్నా.. తమకు ఎంటర్టైన్మెంట్‌ దొరికిందని సైలెంట్‌గా వచ్చేస్తున్నారు. అటు సెలబ్రిటీలకు భారీగా డబ్బులిచ్చి తృప్తిపరుస్తున్నారు. ఈ మొత్తం దందాపై పూర్తిస్థాయిలో వివరాలు ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?