ప్రస్తుతం పేరుకైతే పరిటాల ఫ్యామిలీ రాప్తాడు నియోజకవర్గంతో పాటు ధర్మవరం నియోజకవర్గం బాధ్యతల్లో కూడా ఉంది! గత ఎన్నికల్లో రాప్తాడులో వీరు నెగ్గుకు రాలేకపోయినా, ధర్మవరం నుంచి ఓడిన వరదాపురం సూరి తన అవసరార్థం భారతీయ జనతా పార్టీలో చేరడంతో శ్రీరామ్ ను ధర్మవరం ఇన్ చార్జిగా ప్రకటించారు చంద్రబాబు! పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్మవరం మీద అజమాయిషీ చేయడానికి పరిటాల ఫ్యామిలీ చాలా ఉత్సాహం చూపించింది. అయితే పార్టీ ఓడిపోయాకా వీరికి ఆ బాధ్యతలు అదనంగా దక్కాయి. మరి అధికారం ఉన్నప్పుడు అంతా దున్నేయాలనిపిస్తుంది. అది లేనప్పుడు ఇదంతా ఎక్కువనిపించవచ్చు!
అందులోనూ రాప్తాడులోనే ఓడిపోయి ఉన్నారు. అక్కడ బలమైన ప్రత్యర్థిని వచ్చే ఎన్నికల్లో కూడా ఎదుర్కొనాలి. అలాంటిది మూలాలు లేని ధర్మవరంలో ఇంకొకరు పోటీ చేసి నెగ్గుకురావడం మాటల్లో చెప్పుకోవడానికి కూడా తేలికగా లేదు. అందులోనూ చాలా యేళ్లుగా ధర్మవరంపై పరిటాల ఫ్యామిలీ నీడ లేదు. వ్యాపారకేంద్రం అయిన ధర్మవరంలో వీరు ఎంట్రీ ఇస్తే స్థానిక వ్యాపారుల్లో కూడా హడల్ మొదలవుతుంది. 90లలో పరిటాల ఫ్యాక్షన్ కార్యకలాపాలకు ధర్మవరం వేదికగా నిలిచింది.
ఇప్పుడు ధర్మవరం టీడీపీ ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ అంటే ఒక్కసారిగా 90లలోని ఫ్యాక్షన్ రోజులు గుర్తుకు రాకమానవు స్థానికులకు. దీంతో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీరామ్ చేత పోటీ చేయించినా స్థానికంగా సానుకూలత ఉండే అవకాశమే లేదు. శ్రీరామ్ పోటీ చేస్తే గ్రామాలు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం అవుతాయి. ధర్మవరం టౌన్లో టీడీపీ క్యాడర్ కు ఉత్సాహం వస్తుందేమో కానీ, స్థానిక వ్యాపారులు ఎలా ఆలోచిస్తారనేది కీలకమైన అంశం.
ఎలాంటి ఫ్యాక్షన్ తగాదాలు, బెదిరింపులు, కిడ్నాపుల లేకుండా ధర్మవరం టౌన్ దాదాపు 15 యేళ్ల నుంచి ప్రశాంతంగా ఉంది. వరదాపురం సూరి, కేతిరెడ్డిల మధ్యన 15 యేళ్లుగా పోటీ సాగుతూ ఉంది. పోటీ రాజకీయం వరకే! ఇలాంటి నేపథ్యంలో పరిటాల అంటే స్థానికుల్లో కూడా ఒక కలకలం!
ఈ పరిస్థితుల నడుమ మరో ప్రచారమూ జరుగుతూ ఉంది. చంద్రబాబు కూడా పునరాలోచిస్తున్నారని.. ధర్మవరం నుంచి అభ్యర్థిత్వం విషయంలో మరొక ఛాయిస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. శ్రీరామ్ కు బహుశా ధర్మవరం టికెట్ దక్కకపోవచ్చని, పరిటాల ఫ్యామిలీ కేవలం రాప్తాడుకే పరిమితం కావాల్సి రావొచ్చనేది నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ప్రచారం.
ఇప్పటికీ వరదాపురం సూరికే అవకాశాలున్నాయని, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థిత్వం ఖరారు కావొచ్చనే ప్రచారమే ఉంది. అవకాశం వాదం కొద్దీ సూరి తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీ వైపు వెళ్లినా అక్కడ చంద్రబాబు మనిషే అని మొదటి నుంచి అంతా అనేదే. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆలస్యం ఆయనకే టికెట్ దక్కుతుందనే ప్రచారం ఉంది. ఈ విషయం, చంద్రబాబు తీరు పరిటాల కుటుంబానికి కూడా తెలుసని, అందుకే వారు ధర్మవరం విషయంలో మరీ అంతగా పూసుకుంటున్నది లేదని టాక్.
ఒకవేళ వరదాపురం సూరి రేపోమాపో టీడీపీలో చేరి టికెట్ పొందినా కథ మారిపోదు. టీడీపీ అభ్యర్థి మరీ అంత అవకాశవాదాన్ని చూపిస్తే స్థానిక క్యాడర్ కూడా హర్షించదు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, అది చేజారగానే తమకు అందుబాటులో లేకుండా బీజేపీకి లోకి వెళ్లిపోయి, ఎన్నికలొస్తున్నప్పుడు ఇలా తిరిగొచ్చేస్తే.. క్యాడర్ ఎలా జేజేలు కొడుతుంది? వరదాపురం సూరిని పిలిచి చంద్రబాబు టికెట్ ఇస్తే.. పార్టీ కి ఓటమి ఖరారు అయినట్టే!
పరిటాల శ్రీరామ్ అయితే ఈ స్థానికేతరుడిని జనం ఆమోదించే అవకాశం లేదు, సూరి అయితే పార్టీ క్యాడరే సహకరించదు.. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ కాకుండా పార్టీ పాత కాపులు గోనుగుంట్ల కుటుంబీకులు తెరపైకి వస్తున్నారు! కమ్మ సామాజికవర్గానికి చెందిన గోనుగుంట్ల అనంత రెడ్డి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఆయన భార్య 2004లో ఇక్కడ చివరి సారి నెగ్గారు. అప్పుడు పొత్తులో భాగంగా ఈ సీటును కాంగ్రెస్ వాళ్లు కమ్యూనిస్టులకు ఇచ్చారు. దీంతో తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత గోనుగుంట్ల కుటుంబం రాజకీయంగా అంత యాక్టివ్ గా లేదు.
గోనుగుంట్ల జయమ్మ తనయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారమూ జరుగుతూ ఉంది. అటు శ్రీరామ్, ఇటు సూరి కాకుండా చంద్రబాబు ఇలా మధ్యేమార్గం అనుసరించవచ్చనేది స్థానికంగా జరుగుతున్న ప్రచారం!