కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి, ఇక మోడీ తగ్గుతాడట. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో. అది కూడా ఇప్పటికిప్పుడు దేశంలో తమను రక్షించేది చంద్రబాబు తప్ప మరెవరూ కాదని, చంద్రబాబుతో మోడీ కాళ్ల బేరానికి వస్తారట! బాబ్బాబూ మమ్మల్ని రక్షించండి, మాతో పొత్తు పెట్టుకుని దేశమంతా మమ్మల్ని గెలిపించండి అంటూ చంద్రబాబుతో మోడీ అండ్ కో మొరపెట్టుకుంటుంది.
కర్ణాటకలో ఓడిపోయిన పాపానికి చంద్రబాబు కాళ్లను కడిగి ఏపీలో ఆయనతో పొత్తు పెట్టుకుని, అర్జెంటుగా చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి చేసేందుకు మోడీ ఊడిగం చేస్తారిక! అచ్చంగా .. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పచ్చచొక్కాల వాదనలు ఇలానే ఉన్నాయి!
ఇందుకే.. పచ్చపార్టీ పరిస్థితి ఇలా తయారైంది. సొంతంగా గెలవలేము అని ఏ రోజుకారోజు జనాలకు క్లారిటీ ఇవ్వడానికి వీరు అహర్నిశలూ ఆరాటపడుతూ ఉన్నారు. మోడీతో పొత్తు లేనిది ఏపీలో ఏం చేయలేని జవచచ్చిన స్థాయిలో ఉంది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ!
అయితే.. ఇందులో అర్థం కాని విషయం ఏమిటంటే, కర్ణాటకలో మోడీ నోటు చెల్లలేదు. అలాంటిది ఏపీలో ఎలా చెల్లుతుంది? కర్ణాటకలోనే చెల్లని నోటు ఏపీలో చెల్లుతుందా? ఒకవైపు మోడీ పార్టీ ఓడినందుకు పండగ చేసుకుంటూ, మరోవైపు మోడీ తమ వద్దకు రావాలని, తమతో పొత్తు పెట్టుకోవాలని, పెట్టుకుంటాడని పచ్చపార్టీ అభిమానాలు పోతురాజుల్లా ఊగిపోతూ ఉండటం ఆశ్చర్యకరం.
దేశంలో మోడీపై భ్రమలు అయితే తొలగిపోతున్నాయి. ఇందుకు దాదాపు పదేళ్ల సమయం పట్టింది. ఇందుకు తార్కాణం కర్ణాటక ఫలితం. కర్ణాటకను బీజేపీ వాళ్లు అచ్చంగా ఉత్తరాదిని ట్రీట్ చేసినట్టుగానే ట్రీట్ చేశారు. ఇసుమంతైనా అందులో సందేహం లేదు. మతపరంగా కర్ణాటకను చాలా సెన్సిటివ్ గా మార్చారు. ఎన్నికల ప్రచార సభల్లో హనుమాన్ చాలీసా పాడారు. ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేశారు పోలింగ్ కు సమయం దగ్గరపడ్డాకా. హిజాబ్ నిషేధం అన్నారు.
బహుశా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇంత మతరాజకీయం చేయలేకపోతోంది. అలాంటి కర్ణాటకలో చేసింది. దీని వల్ల హిందూ ఓట్లు గంపగుత్తగా పడతాయని బీజేపీ నేతలు లెక్కలేశారు. జనాలను గొర్రెలనుకున్నారు. హిందుత్వం అంటూ ఉంటే చాలు.. ఇక తామేం చేసినా ప్రజలు పట్టించుకోరని బీజేపీ నేతలు వేసిన లెక్కలు తప్పయ్యాయి. కథ అడ్డం తిరిగింది.
మరి మోడీ మానియా దాదాపు అస్తమయం అవుతున్న వేళ బీజేపీతో పొత్తు కోసం ఆరాటపడటం పచ్చపార్టీ దౌర్భాగ్యస్థితికి నిదర్శనం. పొత్తు కోసమే అయితే జనసేన ఉండనే ఉంది టీడీపీకి. మరి ఆ పార్టీతో వెళ్లినా సంతృప్తి లేదు. బీజేపీ కూడా కలిసి రావాలని, కర్ణాటకలో ఓడిన మోడీ ఇక చంద్రబాబును నెత్తిన పెట్టుకుని ఏపీకి ఈయనను ముఖ్యమంత్రిగా చేస్తాడని పచ్చపార్టీ కలల్లో తేలిపోతోంది. మరి చంద్రబాబును సీఎంగా చేసే శక్తి ఉన్న మోడీ.. కర్ణాటకలోనే బీజేపీని ఎందుకు గెలిపించుకోలేకపోయాడబ్బా!