వైసీపీకి టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి!

తిరుప‌తి అనేది ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌రం. ఈ న‌గ‌రానికి దేశ‌విదేశాల నుంచి నిత్యం యాత్రికులు వ‌స్తుంటారు. తిరుమ‌లేశుని సంద‌ర్శ‌నార్థం ఏడాదిలో ఒక్క‌సారైనా తిరుప‌తి, తిరుమ‌లకు వ‌స్తుంటారు. అయితే తిరుప‌తి న‌గ‌రాభివృద్ధికి టీటీడీ నిధుల…

తిరుప‌తి అనేది ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక న‌గ‌రం. ఈ న‌గ‌రానికి దేశ‌విదేశాల నుంచి నిత్యం యాత్రికులు వ‌స్తుంటారు. తిరుమ‌లేశుని సంద‌ర్శ‌నార్థం ఏడాదిలో ఒక్క‌సారైనా తిరుప‌తి, తిరుమ‌లకు వ‌స్తుంటారు. అయితే తిరుప‌తి న‌గ‌రాభివృద్ధికి టీటీడీ నిధుల వెచ్చించ‌డంపై ఇటీవ‌ల బీజేపీ అడ్డు త‌గులుతుండ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్ర‌మంలో తిరుప‌తి అభివృద్ధికి టీటీడీ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌డంపై స్థానిక ప్రెస్‌క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం అఖిల‌ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో తిరుప‌తి అభివృద్ధికి టీటీడీ నిధులు వెచ్చించాల‌న్న అధికార పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. తిరుప‌తి ద్రోహిగా మిగిలిపోవాల్సి వ‌స్తుంద‌న్న భ‌యంతో టీడీపీ అధికార ప‌క్షానికి వెన్నుద‌న్నుగా నిలుస్తాన‌ని ప్ర‌క‌టించింది.  

తిరుపతి నగరాభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు చేయడం ఏ మాత్రం తప్పు కాదని అన్ని రాజకీయ పార్టీలు, జర్నలిస్టులు ముక్త కంఠంతో చెప్పాయి. నగరాభివృద్ధికి అడ్డు చెబుతున్న బిజెపి అభ్యంతరాలను లెక్కే పెట్టాల్సిన అవసరం లేదని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. టీటీడీ నిధులతో తిరుపతి అభివృద్ధి అనే అంశంపై తిరుపతి ప్రెస్ క్లబ్ మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

తిరుపతి అభివృద్ధికి టీటీడీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తప్పే లేదని ప‌లువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బిజెపి రాజకీయ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. తిరుపతి లో 42 శాతం టీటీడీ ఆస్తులు ఉన్నా మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క రూపాయి పన్ను వసూలు చేయడం లేదన్న విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఈ విషయంలో బిజెపి విధానం ప్రమాదకరమని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. 28-5-1987 న ప్రభుత్వం ఆమోదించిన టీటీడీ చట్టంలోని 146వ పేజీ 111 పాయింట్ లో టీటీడీ తిరుపతి నగరంలో భక్తులు, యాత్రికుల కోసం తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం కోసం నిధులు ఖర్చు చేయవచ్చని స్పష్టంగా ఉందనే విషయం సిపిఎం నాయకుడు కందారపు మురళి తెలియజేశారు. ఈ అంశంపై చర్చే దౌర్భాగ్యమని, జెరూసలెం నగరాభివృద్ధి కి అక్కడి అన్ని మత సంస్థలు, వాటికన్ సిటీ అభివృద్ధి కి పోప్ సంస్థానం కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నాయనే విషయం బిజెపి నాయకులు తెలుసుకుంటే మంచిదన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చినబాబు మాట్లాడుతూ, తిరుపతి అభివృద్ధి కి టీటీడీ ఎన్ని నిధులు అయినా ఖర్చు చేయవచ్చని చెప్పారు. తమ పార్టీ విధానం కూడా అదేనని వెల్లడించారు.

వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, అజయ్, వాసు యాదవ్, ఆర్పీఐ పార్టీ నాయకుడు ఆంజయ్య, సిపిఐ నాయకుడు మురళి, రాయలసీమ మేధావుల ఫోరం క‌న్వీన‌ర్‌ పురుషోత్తం రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు కృష్ణ ప్రసాద్ తో పాటు పలువురు జర్నలిస్టులు తిరుపతి అభివృద్ధికి, పారిశుధ్య నిర్వహణకు నిధులు ఇవ్వాలని టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.

ఒంటరిగా బిజెపి.. తిరుపతి నగర అభివృద్ధికి టీటీడీ వార్షిక బడ్జెట్ నుండి 1 శాతం నిధులు రాకుండా అడ్డుపడిన బిజెపి ఒంటరిగా మిగిలింది. ఇప్పుడు తిరుపతి నగర పారిశుధ్య నిర్వహణకు కూడా టీటీడీ నిధులు ఇవ్వరాదని వితండ వాదానికి దిగి పరువు పోగొట్టుకుంది. ఆ పార్టీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై బిజెపిలోని ఒక వర్గం కూడా గుర్రుగా ఉంది. బిజెపి మిత్రపక్షం జనసేన కూడా టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది. అఖిలపక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆ పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఇందుకు సంబంధించి తమ పార్టీ విధానం వివరిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బిఆర్ఎస్, ఇతర రాజకీయ పక్షాలు, స్థానిక జర్నలిస్టులు కూడా తిరుపతి నగర అభివృద్ధి కి, పారిశుధ్య నిర్వహణకు టీటీడీ నిధులు ఇవ్వాల్సిందేనని ఏకగ్రీవ తీర్మానం చేయడం భారతీయ జనతా పార్టీకి నోట్లో వెలక్కాయ పడినట్లే.

ఆంధ్రజ్యోతి, ఈనాడుపై ఆగ్రహం.. తిరుపతి నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణకు టీటీడీ నిధులు కేటాయించడాన్ని తప్పు పడుతూ ఆంధ్రజ్యోతి, ఈనాడు వండి వార్చుతున్న కథనాలను సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రజలకు దురభి ప్రాయం కల్పించేందుకు రాస్తున్న రాతలకు స్పందన లేకపోవడంతో ఈ నిధుల విడుదలలో అవినీతి జరిగిందనే తప్పుడు కథనాలను రాయడంపై అఖిలపక్ష సమావేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది.