తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడి కుటుంబానికి ఇది కష్ట కాలం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబునాయుడి అరెస్ట్ టీడీపీకి గట్టి షాక్. బెయిల్ వస్తుందని అనుకుంటే, ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించారు. ఇవాళ ఆయన్ను సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు నారా లోకేశ్ కలిశారు. అనంతరం మీడియాతో భువనేశ్వరి మాట్లాడారు.
సహజంగా ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి చెందిన మహిళలు ఆవేదనతో మాట్లాడితే జనంలో ఎంతోకొంత సానుభూతి లభిస్తుంది. అయితే భావోద్వేగాన్ని పండించడంలో చంద్రబాబు సతీమణి అట్టర్ ప్లాప్ అయ్యారని టీడీపీ వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.
గతంలో వైఎస్ జగన్ను సీబీఐ అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తే, ఆయన తల్లి విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు భారతి, షర్మిల ప్రసంగాలు తెలుగు సమాజంలో సానుభూతి వెల్లువెత్తించాయని వారు అంటున్నారు. జగన్ కుటుంబంలోని మహిళల స్థాయిలో కాకపోయినా, కనీసం కూడా ఉద్వేగపూరిత వ్యాఖ్యలు భువనేశ్వరి చేయలేకపోయారని టీడీపీ నేతలు అంటున్నారు.
బాబును కలిసిన అనంతరం మీడియాతో భువనేశ్వరి మాట్లాడుతూ …”ఏమని మాట్లాడమంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమో ఆయన మాట్లాడేవారు. చంద్రబాబు జీవితమంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం ధారపోశారు. కుటుంబం కోసం ఆలోచించాలని నేను గట్టిగా నిలదీసినట్టు మాట్లాడితే, ఏపీ తర్వాతే కుటుంబమని చెప్పేవారు. అట్లాంటి మనిషిని తీసుకెళ్లి, ఆయన కట్టిన జైలు గదిలోనే కట్టిపడేశారు. ప్రజలే ఆయన కోసం పోరాడాలి. బాబు దగ్గరి నుంచి వస్తుంటే, నాలోని ఒక భాగమేదో వదిలేసి వచ్చినట్టుంది. ఇది కుటుంబానికి చాలా కష్ట సమయం. నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ ఎక్కడికీ వెళ్లదు. మా కుటుంబం ఎప్పుడూ ప్రజలు, టీడీపీ కేడర్ కోసం పోరాడి నిలుస్తుంది. తన ఆరోగ్యం బాగుందని , బాధపడొద్దని చంద్రబాబు చెప్పారు. భద్రత ఇస్తున్నారే కానీ, ఎక్కడో నాకు భయంగా వుంది. నంబర్ 1 సౌకర్యాలు కల్పించాలి. కానీ నాకు అక్కడ కనిపించలేదు” అని ఆమె అన్నారు.
టీడీపీ నేతలెవరో రాసిచ్చిన స్క్రిప్ట్ బట్టి కొట్టి తెలుగులో అతి కష్టమ్మీద మాట్లాడిన ఫీలింగ్ కలిగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భువనేశ్వరి ఆవేదన ఆవిష్కృతం కాలేదనేది సొంత పార్టీ నేతల అభిప్రాయం కూడా. దీంతో బాబును జైల్లో వేశారన్న సానుభూతికి కూడా టీడీపీ నోచుకోలేదనే చర్చకు తెరలేచింది. బాబుకు మరికొంత కాలం బెయిల్ లభించకపోతే మాత్రం టీడీపీ బలహీనపడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.