రెండు కుటుంబాలకు ఒకేసారి టీడీపీ షాక్…!

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు లోయ సీటు ప్రాధాన్యత కలిగినది. ఈ సీటు విషయంలో టీడీపీ ఆశావహులకు చంద్రబాబు షాక్ ఇచ్చేశారు. అరకు నుంచి గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా చేసిన తండ్రులు మావోల…

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో అరకు లోయ సీటు ప్రాధాన్యత కలిగినది. ఈ సీటు విషయంలో టీడీపీ ఆశావహులకు చంద్రబాబు షాక్ ఇచ్చేశారు. అరకు నుంచి గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా చేసిన తండ్రులు మావోల చేతిలో హతం అయ్యారు. తనయులు ఇద్దరికీ టీడీపీ అప్పట్లో ఇచ్చిన హామీలు ఇపుడు పక్కకు పోయాయని వాపోతున్నారు.

అరకులో రా కదలిరా అంటూ మీటింగ్ పెట్టిన చంద్రబాబు అక్కడ నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిగా సియ్యారి దొన్ను దొరను ప్రజలకు పరిచయం చేసారు. ఈ దొన్ను దొర వైసీపీలో ఉంటూ టీడీపీకి వచ్చిన వారు. ఆయన 2019 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో రెబెల్ గా పోటీ చేసి 27 వేల ఓట్లను సాధించారు.

టీడీపీకి ఆ ఎన్నికల్లో 19 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో వైసీపీ రెబెల్ ని ఈసారి తెచ్చి ఆ పార్టీ అభ్యర్ధిని చేస్తోంది. దీంతో ఎమ్మెల్యే కాకుండానే బాబు దయతో ఆరు నెలల మంత్రిగా పనిచేసిన పేరు తెచ్చుకున్న కిడారి శ్రావణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడింది.

అంతే కాదు టీడీపీకి ఒకనాడు ఎమ్మెల్యేగా చేసిన సివేరి సోమ కుమారుడు సివేరి అబ్రహాం కి 2024లో టికెట్ తప్పకుండా ఇస్తామని చెప్పి చేసిన హామీకి కూడా ఠికాణా లేకుండా పోయింది అని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. బాబు ఇలా వెళ్లగానే అలా అబ్రహం అనుచరులు అరకు మైదానంలో తమ ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.

వెనువెంటనే మీడియా మీటింగ్ పెట్టిన అబ్రహం చంద్రబాబు మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. తాను రెబెల్ గా అరకు నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తనకు అరకు నియోజకవర్గం మొత్తం మీద మంచి మద్దతు ఉందని తాను గెలిచి వస్తాను అని ఆయన అంటున్నారు. కిడారి శ్రావణ్ కుమార్ వర్గం అయితే బయటకు ఏమీ అనడం లేదు కానీ వారిలోనూ నిర్వేదం కనిపిస్తోంది.

శ్రావణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ టీడీపీలోకి ఫిరాయించారు. మావోల దాడిలో చనిపోయారు. అప్పట్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్న శ్రావణ్ ని టీడీపీ రాజకీయాల్లోకి రప్పించింది ఎమ్మెల్యేగా గెలవకుండా మంత్రిని చేసింది. 2019లో టికెట్ ఇస్తే ఓటమి పాలు అయ్యారు శ్రావణ్. గడచిన అయిదేళ్ళుగా జనంలో ఉంటూ పట్టు సాధించారు. అయితే ఈసారికి నో టికెట్ అనేసింది టీడీపీ అని ఆయన అనుచరులు మధన పడుతున్నారు.