కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు భావోద్వేగ ప్రకటనతో సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. ఒకవేళ టీడీపీని గెలిపించకపోతే… ఇవే తనకు చివరి ఎన్నికలంటూ దాదాపు కన్నీటిపర్యంతమయ్యేంతగా ఉద్వేగానికి లోనయ్యారు. తనకివే చివరి ఎన్నికలంటూ బాబు అన్న మాటలపై వైసీపీ ప్రజాప్రతినిధులు సెటైర్స్ విసురుతున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ… మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పైన దేవుడు తథాస్తు అంటాడన్నారు. చంద్రబాబు ఇదే తనకు చివరి ఎన్నికలనడంపై దేవుడు తథాస్తు అంటారన్నారు. బాబు కోరికను దేవుడు తప్పక తీరుస్తారని వ్యంగ్యంగా అన్నారు. బాబు అనుకున్నంత పరిపాలనా దక్షుడు కాదని బొత్స అభిప్రాయపడ్డారు.
అదృష్టం బాగుండి ఆయన అన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు లాంటి నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదన్నారు. ఇది శాసనం అని బొత్స స్పష్టం చేశారు. బాబు అధికారంలోకి వస్తే అతివృష్టి, అనావృష్టి తప్పవని హెచ్చరించారు. బాబు చివరి ఎన్నికల కామెంట్పై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తనదైన స్టైల్లో స్పందించారు.
2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని తేల్చి చెప్పారు. ప్రజలకు ఈ సంగతి ఎప్పుడో తెలుసన్నారు. చంద్రబాబుకే ఆలస్యంగా తెలిసిందని ఆయన అన్నారు. ఇప్పటికే కుప్పం బాబు నుంచి చేజారిందని కన్నబాబు విమర్శించారు. బాబు వ్యాఖ్యలు బెడిసి కొట్టినట్టుగా కనిపిస్తున్నాయి. బాబు చివరి ఎన్నికల కామెంట్స్ను వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుని రివర్స్ ఎటాక్ చేస్తోంది.