తన కూతురు, కొడుకు సినీ ప్రవేశంపై మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి రోజా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదట ఆమె టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సొంత వాళ్లే వెన్నుపోటు పొడవడంతో ఓటమిపాలయ్యానని అప్పట్లో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ఆ తర్వాత ఆమె వైఎస్ జగన్ వెంట నడిచారు. నగరి నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండో దఫా కేబినెట్ విస్తరణలో రోజా మంత్రి పదవి దక్కించుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. చిత్తూరు జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కాదని, రోజాకు చాన్స్ దక్కే అవకాశమే లేదన్నారు. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ మంత్రి పదవి దక్కించుకున్న రోజా…తన అన్న జగన్ వద్ద పలుకుబడి ఏంటో నిరూపించుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువుదీరిన ప్రాంతంలో పుట్టడం, పెరగడం, చదువుకోవడం, రాజకీయాల్లో పాల్గొనడం, మంత్రిగా అడుగు పెట్టడం ఆనందం కలిగిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా కుమార్తె, కుమారుడు సినీ రంగంలో ప్రవేశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
సినిమాల్లోకి రావడం తప్పేమీ కాదన్నారు. తన కుమార్తె, కుమారుడు సినిమాల్లోకి వస్తానంటే తల్లిగా, నటిగా చాలా సంతోషిస్తానన్నారు. వారిని ప్రోత్సహిస్తానన్నారు. తన కుమార్తె బాగా చదువుకుంటోందని, సైంటిస్ట్ కావాలనేది తన లక్ష్యమన్నారు. సినిమాల్లో నటించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.