తాను చేస్తేనే శృంగారం అంటున్న చంద్రబాబు!

‘తాను చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం..’ అనేది చాలా పాపులర్ సామెత! ఒకే పనిని- తాము చేసినప్పుడు ఘనకార్యం ఉద్ధరించినట్లుగా టముకు వేసుకోవడం, అదే పని తమ ప్రత్యర్థులు చేసినప్పుడు వారు అత్యంత…

‘తాను చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం..’ అనేది చాలా పాపులర్ సామెత! ఒకే పనిని- తాము చేసినప్పుడు ఘనకార్యం ఉద్ధరించినట్లుగా టముకు వేసుకోవడం, అదే పని తమ ప్రత్యర్థులు చేసినప్పుడు వారు అత్యంత ఘోరమైన, నీచమైన పనులు చేసినట్టుగా విమర్శించడం అనేది ఈ సామెత యొక్క అంతరార్థం! మనకు ప్రస్తుత రాజకీయాల్లో ఈ సామెతకు తగిన విధంగా వ్యవహరించే వ్యక్తులు బోలెడంత మంది కనిపిస్తారు. అయితే వారిలో ఎవరూ కూడా చంద్రబాబు నాయుడుని మించిన వారు ఉండబోరు అనేది సత్యం!

చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్నికల సర్వేల ప్రస్తావన తెచ్చారు. ఇటీవల కాలంలో వెల్లడైన అనేక సర్వేలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డంకా భజాయించి ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వేల ఫలితాలు వైసిపి కార్యకర్తల నాయకుల లో ఉత్సాహం నింపుతున్నాయి. వారు మరింత జోరుగా ప్రజలతో మమేకం అవుతూ, ప్రతిచోటా మరింత గట్టి మెజారిటీ సాధించాలని ముందుకు సాగుతున్నారు. ‘వై నాట్ 175’ అనే జగన్ నినాదాన్ని నిజం చేయాలని అనుకుంటున్నారు.

అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు సర్వేలు చేయించి ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆక్రోశిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అంటున్నారు. వైసిపి చేయిస్తున్న సర్వేలు తప్పుడు సర్వేలని విమర్శిస్తున్నారు.

అదే సమయంలో తెలుగుదేశం గెలుస్తుందని చెప్పిన మరొక సర్వే వివరాలను మాత్రం ఆయన చాలా ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇండియా టుడే- సి ఓటర్ సంస్థతో కలిసి నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి 15 నుంచి 20 లోక్ సభ ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉన్నదని అంచనా వేసిన సంగతి తెలిసిందే. సదరు ఇండియా టుడే సర్వే మాత్రం మహాద్భుతమైనదని ఆ ఫలితాలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఘనవిజయం సాధిస్తుందనే సంగతి మనకు అర్థమవుతుందని చంద్రబాబునాయుడు సెలవిస్తున్నారు. 

అంటే చంద్రబాబు దృష్టిలో ఏ సంస్థ సర్వే నిర్వహించినా ‘తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది’ అని చెబితే మాత్రమే అది నిజాయితీగల సర్వే కింద లెక్క! వైసిపి గెలుస్తుందంటే అవన్నీ తప్పుడు సర్వేలన్నమాట! చంద్రబాబు నాయుడు బుద్ధిలోని ద్వంద్వనీతిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.