వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అంటే ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అసహనం, భయం. ఎన్నికలు సమీపించేకొద్ది ఇవి ఇంకా ఆయనలో బాగా పెరిగే అవకాశాలున్నాయి. ఎన్నికలు ఎప్పుడొస్తాయా? జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు దించేద్దామా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని పైకి చంద్రబాబు ఎన్ని చెప్పినప్పటికీ, ఏమవుతుందోననే భయం మాత్రం ఆయన్ని వెంటాడుతోంది.
గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగాన్ని గమనిస్తే… ఈ వాస్తవాన్ని గుర్తించొచ్చు.
‘పార్టీ కోసం కష్టపడకుండా ఎన్నికల్లో సీట్లు కావాలంటే కుదరదు. సర్వశక్తులూ ఒడ్డి సమర్థవంతంగా పోరాడితే తప్ప ఈసారి ఎన్నికలను ఎదుర్కోలేం. ఎప్పుడూ 60 నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో సులువుగా గెలిచే నా నియోజకవర్గం (కుప్పం)లో కూడా గొడవలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి’
‘మీరు ఇంట్లో పడుకుంటే మాత్రం ఎన్నికల్లో కూడా ఇంట్లోనే పడుకోవాల్సి వస్తుంది’
కుప్పంలో తనకే దిక్కు లేకుండా పోతోందని చంద్రబాబు తన భయాన్ని బయట పెట్టుకున్నారు. ఈ దఫా జగన్ను ఎదుర్కోవడం ఆషామాషీ కాదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీన్ని బట్టి జగన్ అంటే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో పడుకుంటే… ఇక శాశ్వతంగా అక్కడే ఉండాల్సి వస్తుందని పార్టీ నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు బద్దకాన్ని వీడాలని కోరడం ద్వారా, వారు ఓటింగ్కు రావడం లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆ వర్గాలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాయనేది ఆయన అంచనా. అలాంటి వాళ్లు ఓట్లు వేయడానికి రాకపోతే తనకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇలా అనేక రకాల భయాలు, ఆందోళనల మధ్య చంద్రబాబు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.