బాబు ఆలోచనలనిండా ముసలితనమేనా?

చంద్రబాబు నాయుడుకు వార్ధక్యం వచ్చేసింది. నిజానికి ఆయనకు వార్ధక్యం ఎన్నడో వచ్చింది కానీ కొంతకాలం యువకుడు లాగానే పని చేశారు.. మరి కొంతకాలం యువకుడి లాగానే కనిపించారు.. మరి కొంతకాలం అలా కనిపించడానికి ప్రయత్నించారు!…

చంద్రబాబు నాయుడుకు వార్ధక్యం వచ్చేసింది. నిజానికి ఆయనకు వార్ధక్యం ఎన్నడో వచ్చింది కానీ కొంతకాలం యువకుడు లాగానే పని చేశారు.. మరి కొంతకాలం యువకుడి లాగానే కనిపించారు.. మరి కొంతకాలం అలా కనిపించడానికి ప్రయత్నించారు! చివరికి ఇప్పుడు ఆయనకు కేవలం వయసులో మాత్రమే కాదు ఆలోచనల నిండా పూర్తిగా ముసలితనం కమ్మేసుకుంది. 

రాజకీయ, రాజకీయేతర విషయాలు ఏవి మాట్లాడినా సరే ఆయన మాటలలో ఆలోచనలలో ముసలితనం మాత్రమే ప్రవహిస్తూ బయటకు వస్తోంది. తాజాగా వచ్చే ఏడాది జి20 శిఖరాగ్ర సదస్సు భారతసారథ్యంలో జరగబోతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మోడీ సారధ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు మాటలు కూడా “ముసలితనము- మరియు దాని పరిణామాలు – మరియు దానిని అధిగమించడానికి చేయవలసిన కసరత్తు” అనే అంశం ప్రధానంగానే సాగడం గమనిస్తే మనకు ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది!

చంద్రబాబు నాయుడు 25 సంవత్సరాల భవిష్యత్ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఈ సమావేశంలో ఉపదేశించారు. ప్రస్తుతం మన దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం కనుక ఇంకో 25 సంవత్సరాలు ముందుచూపుతో వందేళ్ల స్వాతంత్ర వేడుకలు జరుపుకునే సమయానికి భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి అనే రకమైన ఉపన్యాసం ఇచ్చారు. 

ఇందులో భాగంగా వార్ధక్యం గురించే ప్రస్తావించడం విశేషం. 25 సంవత్సరాల తర్వాత అంటే 2047 నాటికి మనదేశంలో ముసలి వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటుందని అన్యాపదేశంగా చెప్పారు. చాలా అందమైన మాటలలో భారతదేశంలో సగటు వయస్సు పెరుగుతుంది అనే మాట అన్నారు. కాబట్టి, దానిని సమన్వయం చేసుకునేలాగా ప్రణాళికాబద్ధంగా విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలని అన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు గుర్తించవలసిన విషయం ఏంటంటే 2004 నాటికి సగటు ఆయుఃప్రమాణం పెరుగుతుంది అనేదే కాదు. ఆల్రెడీ మన దేశంలో సగటు వయస్సు ఎప్పుడో పెరిగింది. ఇదివరకు సగటు వయస్సు 60 ఏళ్లు అనుకునే వాళ్ళందరూ, ఇప్పుడు దాన్ని సగటు వయసు 70 ఏళ్లు అనుకుంటున్నారు. ఆ పరిధిని దాటిపోయి 72 ఏళ్ల ముసలి వయసులో ఉన్నా కూడా ‘నాకు ఇంకా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి.. నేను ముఖ్యమంత్రిగా ఇంకా పాలించాలని ఉంది’ అని ఆశ చావక ప్రజలు ప్రజల ఎదుటకు వచ్చి లాస్ట్ ఛాన్స్ అనే నినాదాన్ని వినిపిస్తున్నారు. 

ముసలి వాడిని కనుక దయ చూపించండి అని బతిమాలుతున్నారు. సగటు వయసు పెరిగిపోయినా సరే ఆశ చావక వెంపర్లాడుతున్న వారిని తట్టుకోవడం ఎలాగా, ఆ బెడద నుంచి తప్పించుకోవడం ఎలాగా అనేది రాష్ట్రానికి పట్టిన ఖర్మలాగా పరిస్థితి తయారవుతోంది. ఇలాంటి స్థితి ఎన్నడో ఇంకో పాతికేళ్ల తర్వాత వస్తుందని చంద్రబాబు చెప్పడం.. ఇప్పుడు ఉన్న తన ఆశను దాచి పెట్టుకోవడానికేనా అన్నట్టుగా అనిపిస్తోంది. 

మొత్తానికి చంద్రబాబు ఏ వేదిక ఎక్కినా సరే.. ఆయన ఆలోచనల్లో ముసలతనం మాత్రమే కనిపిస్తున్నదని తెలిసిపోతోంది.