ఇడుపుల‌పాయ‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల రాక‌పై…!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరిక‌పై రోజుకో వార్త ప్ర‌చారంలోకి వ‌స్తోంది. దివంగ‌త వైఎస్సార్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ త‌దిత‌రులు ఇడుపుల‌పాయ‌కు వ‌స్తున్నార‌ని, ష‌ర్మిల పార్టీ…

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్‌లో చేరిక‌పై రోజుకో వార్త ప్ర‌చారంలోకి వ‌స్తోంది. దివంగ‌త వైఎస్సార్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ త‌దిత‌రులు ఇడుపుల‌పాయ‌కు వ‌స్తున్నార‌ని, ష‌ర్మిల పార్టీ విలీనం దాదాపు ఖ‌రారైంద‌నే వార్త‌లు కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇడుపుల‌పాయ‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల రాక‌పై కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్ వ్య‌తిరేక వ‌ర్గ నాయ‌కుడు చింతా మోహ‌న్ క్లారిటీ ఇచ్చారు. ఇడుపుల‌పాయ‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లెవ‌రూ రావ‌డం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌పై ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా వైఎస్సార్‌పై మ‌రోసారి అక్క‌సును బ‌య‌ట పెట్టుకున్నారు.

ఇడుపుల‌పాయ‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు వ‌స్తున్నార‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని ఆయ‌న అన్నారు. దివంగ‌త వైఎస్సార్‌ను నెత్తిన పెట్టుకుని కాంగ్రెస్ త‌ప్పు చేసింద‌ని, మ‌రోసారి దాన్ని పున‌రావృతం చేయ‌ద‌ల‌చుకోలేద‌న్నారు. కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి, కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, మ‌ర్రి చెన్నారెడ్డికి కూడా కుమార్తెలున్నార‌ని, వారు వ‌చ్చి కాంగ్రెస్‌లో చేర‌వ‌చ్చ‌న్నారు.

ఆ మాజీ ముఖ్య‌మంత్రుల కుమార్తెలు ఎంతో, ష‌ర్మిల కూడా కాంగ్రెస్‌కు అంతే స‌మాన‌మ‌ని ఆయ‌న అన్నారు. షర్మిలను నెత్తిన పెట్టుకొని నాయకత్వాన్ని అప్పగించే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు గ‌త కొంత కాలంగా పెద్ద‌ల‌తో మంత‌నాలు సాగుతున్నాయ‌నే ప్ర‌చారంలో నిజం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. గ‌తంలో వైఎస్సార్‌కు వ్య‌తిరేకంగా చింతా మోహ‌న్ కాంగ్రెస్‌లో వ‌ర్గ రాజ‌కీయాలు చేశారు. ఢిల్లీలో త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి, రాష్ట్రంలో పెత్త‌నం చెలాయించేందుకు చింతా మోహ‌న్ ప్ర‌య‌త్నించే వారు. ఇప్పుడు వైఎస్సార్ కుమార్తె కాంగ్రెస్‌లోకి రాక‌ను ఆయ‌న వ్య‌తిరేకిస్తున్న‌ట్టు తేలిపోయింది.