నీకు టికెట్ ఇస్తే ఓడిస్తారుః వైసీపీ ఎమ్మెల్యేతో జ‌గ‌న్‌

టికెట్ కోసం వైసీపీ నేత‌లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. కొంద‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుండ‌గా, మ‌రికొంద‌రి విష‌యంలో ఇవ్వ‌న‌ని మొహం మీదే చెబుతున్నారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి…

టికెట్ కోసం వైసీపీ నేత‌లు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. కొంద‌రికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుండ‌గా, మ‌రికొంద‌రి విష‌యంలో ఇవ్వ‌న‌ని మొహం మీదే చెబుతున్నారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య శుక్ర‌వారం సీఎం జ‌గ‌న్‌ను  క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా త‌న‌కే సూళ్లూరుపేట టికెట్ ఇవ్వాల‌ని సీఎంను సంజీవయ్య కోరిన‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టికే సూళ్లూరుపేట‌పై పలు స‌ర్వే రిపోర్ట్‌లు జ‌గ‌న్ వ‌ద్ద ఉన్న సంగ‌తి తెలిసిందే. సూళ్లూరుపేట‌లో నీకు టికెట్ ఇస్తే ఓడిస్తార‌ని నేరుగా సంజీవ‌య్య‌కు జ‌గ‌న్ చెప్పార‌ని తెలిసింది. సొంత పార్టీకి చెందిన నేత‌లే నీ నాయక‌త్వాన్ని అంగీక‌రించ‌డం లేదని, వాళ్లే ప్ర‌త్య‌ర్థులుగా మారి ఓడించ‌డం ఖాయ‌మ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది.

దీంతో ప్ర‌త్యామ్నాయంగా స‌త్య‌వేడు వెళ్లాల‌ని సంజీవ‌య్య‌కు జ‌గ‌న్ సూచించిన‌ట్టు స‌మాచారం. అయితే త‌న‌కు త‌మిళం రాద‌ని, అక్క‌డ నెగ్గుకురావ‌డం క‌ష్ట‌మ‌ని జ‌గ‌న్‌తో సంజీవ‌య్య అన్నార‌ని తెలిసింది. అవునా, త‌మిళం బాగా వ‌చ్చ‌ని చెప్పారే, అయినా ఆ నియోజ‌క వ‌ర్గానికి వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని సంజీవ‌య్య‌తో సీఎం అన్నార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో సంజీవ‌య్య షాక్‌కు గురైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త కొంత కాలంగా సంజీవ‌య్య‌కు వ్య‌తిరేకంగా సొంత పార్టీ నేత‌లే అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత పార్టీ నేత‌ల‌పై కేసులు పెట్టించ‌డంతో పాటు తిట్టించ‌డం, కొట్టించ‌డం య‌థేచ్ఛ‌గా చేశార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఈ ప‌రిణామాలే ఆయ‌న‌కు తీవ్ర వ్య‌తిరేక‌త‌ను తెచ్చి పెట్టాయి. టీడీపీలో కంటే వైసీపీలోనే ఆయ‌న ఓట‌మి కోరుకునే వాళ్లు ఎక్కువ కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.