వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న దృష్టా ఆయన ప్రతిపక్షాలపై విమర్శల స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ఇవాళ కర్నూలు జిల్లా పత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు చేసిన మేలును గుర్తు చేస్తునే.. టీడీపీ ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోపై విమర్శలు కురిపించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటూ ప్రజలను నమ్మంచి ఎన్నికల తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటు అని.. కర్ణాటకలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీల మేనిఫెస్టోలను కలిపి బిసిబేలే బాత్ వండేశారని.. వైసీపీ పథకాలను కాపీ కొట్టి పులిహోర కలిపేశారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఒరిజినాలిటీ, పర్సనాలిటీ, క్రెడిబిలిటీ అనేది లేదన్నారు.
పిల్లవాడైన కృష్ణుడిని చంపడానికి వచ్చిన పూతన అనే రాక్షసి, మారీచుడు, రావణుడు కలిస్తే చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచి చంపేసిన మనిషి తిరిగి ఆయనకు దండలు వేసి కీర్తిస్తూన్నరంటూ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం కరువుతో తాండవించేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మంచిగా వర్షాలు పడుతున్నారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులు లాగ నిలబడండి అంటూ.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుని దయ మీ దీవెనలు మాత్రమే అని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందరూ తన పక్షాన్న ఉండాలని వేడుకున్నారు. వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల దృష్టా సీఎం జగన్ లో విమర్శల స్పీడు పెంచినట్లు కనిపిస్తోందంటూన్నారు విశ్లేషకులు.