జనసేన అనేది ఓ విచిత్రమైన పార్టీ. అంతా సినిమాను తలపించేలా రాజకీయం చేస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రాజకీయం చేయడానికి జనసేన ఆవిర్భవించింది. అబ్బే… చెప్పింది చేస్తే పవన్కల్యాణ్కు ఎందుకీ దుస్థితి? ఆయన చెప్పేదొకటి, చేసేది మరొకటి. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసుకోడానికి పార్టీ పదవులు ఇవ్వాలని చాలా కాలంగా ఆ పార్టీ నాయకుల నుంచి డిమాండ్ వుంది. కానీ జనసేన పదవులను అడ్డుపెట్టుకుని, నాయకులు దోపిడీకి పాల్పడుతారనే అనుమానంతో ఎలాంటి నియామకాలు చేపట్టలేదనే విమర్శ వుంది.
ఈ నేపథ్యంలో తాజాగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు విడుదల చేసిన ప్రకటనను చూసి, ఆ పార్టీ నాయకులు ఆశ్చర్యపోతున్నారు. ఆస్ట్రేలియాలోని పలు రాష్ట్రాలకు జనసేన కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు నాగబాబు వెల్లడించారు. నాగబాబు పేర్కొన్న ప్రకారం న్యూసౌత్ వేల్స్లో 15 మంది, విక్టోరియాలో ఏడుగురు, క్వీన్స్లాండ్లో ఐదుగురు, వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఆరుగురు, ఆస్ట్రేలియా క్యాపిటల్ టెరిటరీలో ముగ్గురు చొప్పున కోఆర్డినేటర్లను నియమించారు.
ఎన్నికల తరుణంలో ఏపీలో జనసేన నియామకాలు జరిగితే మరింత ఉత్సాహంగా పార్టీ కోసం పని చేసే అవకాశాలుంటాయి. అదేంటో గానీ, ఆంధ్రాలో కాకుండా ఆస్ట్రేలియాలో పార్టీ పదవుల పందేరం ఎందుకు చేపట్టారో అర్థం కావడం లేదని జనసేన నాయకులు వాపోతున్నారు. విదేశాల్లో ఇప్పటికిప్పుడు పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదని జనసేన నాయకులు అంటున్నారు. అయితే ఆస్ట్రేలియాలో జనసేన నియామకాలపై మరో వాదన కూడా వినిపిస్తోంది.
రానున్న ఎన్నికల్లో డబ్బు కీలక పాత్ర పోషించనుందని, దీంతో విదేశాల్లోని పార్టీ సానుభూతిపరుల నుంచి విరాళాలు సేకరించాలంటే వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. ఒక రకంగా ఈ పదవులన్నీ కొనుక్కోవడం కిందే లెక్క అని జనసేన నేతలే చెప్పడం విశేషం. అసలే పవన్ ప్రతిదీ లాభనష్టాల లెక్కలు వేస్తారని, ఆస్ట్రేలియాలో పదవులు ఇచ్చారంటే ఉత్తి పుణ్యానికే ఉండదనే టాక్ వినిపిస్తోంది.
ఏపీని వదిలిపెట్టి ఆస్ట్రేలియాలో జనసేన పదవుల పందేరాన్ని చూసిన జనం … కేఏ పాల్ అనుకుంటే, ఆయన్ను మించి పవన్ కామెడీ చేస్తున్నారనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఏమైనా జనసేనాని తిక్కకు ఓ లెక్క వుంటుందబ్బా అని సొంత పార్టీ నేతలే అసహనంగా అంటున్న పరిస్థితి.