రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా తమ్ముడు పవన్కల్యాణ్ ఆయన కామెంట్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ్ముడిపై ప్రేమ వల్ల వాస్తవాలను గ్రహించలేక పోతున్నారనే వాళ్లే ఎక్కువ. ఇదే సందర్భంలో చిరు పాజిటివ్ కామెంట్స్పై జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పవన్పై చిరంజీవి అంచనా తప్పు అనేవాళ్ల కోణంలో విశ్లేషణ ఏంటో తెలుసుకుందాం.
‘రాజకీయాల్లో సెన్సిటివ్గా ఉంటే ఎదగలేం. మాటలు అనాలి.. అనిపించుకోవాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. అప్పుడే రాణించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తగినవాడు. మాటలు అంటాడు.. అనిపించుకుంటాడు. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు అత్యుత్తమ స్థానంలో ఉంటాడు’ అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ గురించి చిరంజీవికి తెలిసినంతగా, మరొకరికి తెలిసే అవకాశం లేదు. రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ముళ్లగా ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానాలు దండిగా వున్నాయి. చిరంజీవి సున్నిత మనస్కుడు కావడం వల్లే రాజకీయాల్లో రాణించలేకపోయారనేది నిజం. చిరుతో పోల్చుకుంటే పవన్ సెన్సిటివ్ కాదు. చిరంజీవి అన్నట్టు మాట అంటాడు, అనిపించుకుంటాడు. అయితే పవన్ ఎవరికి కోసం మాట్లాడుతున్నాడు? అలాగే నిందలు ఎదుర్కొంటున్నాడనేది ప్రధాన ప్రశ్న.
తొమ్మిదేళ్ల క్రితం జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ఈ రోజుకూ ఆ పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణానికి నోచుకోలేదు. తాజాగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని పవన్కల్యాణ్ ప్రకటన ఇవ్వడం గమనార్హం. పవన్ మాట పడుతున్నదల్లా చంద్రబాబు కోసమే. పవన్ మాట్లాడుతున్నది కూడా చంద్రబాబు కోసమే అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
పవన్ తన కోసం మాట్లాడ్డం లేదా మాట పడడం ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు చిరంజీవి ఆశించినట్టు ఇప్పుడు కాకపోతే రానున్న రోజుల్లో అయినా ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తమ్ముడి రాజకీయ ప్రవర్తన చిరంజీవి ఆశించిన స్థాయిలో లేదు. ఇదే పవన్ రాజకీయ పంథా అయితే మాత్రం… అన్న ఆకాంక్ష ఎప్పటికీ నెరవేరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.