వైసీపీలోకి ప‌వ‌న్, రుక్మిణి బాధిత త‌ల్లీకొడుకు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాధితులైన త‌ల్లీకొడుకు ప‌సుపులేటి ప‌ద్మావ‌తి, సందీప్ రాయ‌ల్ త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్నారు. హైద‌రాబాద్‌లో జ‌న‌సేన కార్యాల‌య ఇన్‌చార్జ్‌గా ప‌ని చేస్తూ, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆయ‌న పీఎస్ రుక్మిణి కోట వేధింపుల‌తో దాదాపు 30…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బాధితులైన త‌ల్లీకొడుకు ప‌సుపులేటి ప‌ద్మావ‌తి, సందీప్ రాయ‌ల్ త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్నారు. హైద‌రాబాద్‌లో జ‌న‌సేన కార్యాల‌య ఇన్‌చార్జ్‌గా ప‌ని చేస్తూ, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆయ‌న పీఎస్ రుక్మిణి కోట వేధింపుల‌తో దాదాపు 30 మంది ఉద్యోగులు వీధిన‌ప‌డ్డారు. వీరిలో జ‌న‌సేన క్రియాశీల‌క నాయ‌కుడైన ప‌సుపులేటి సందీప్ కూడా ఉన్నారు. అలాగే జ‌న‌సేన రాజ‌కీయ పంథాతో విభేదించి సందీప్ రాయ‌ల్ త‌ల్లి, రాయ‌ల‌సీమ జ‌న‌సేన మ‌హిళా నాయ‌కురాలు ప‌సుపులేటి ప‌ద్మావ‌తి పార్టీకి రాజీనామా చేశారు.

అనంత‌పురం జిల్లాలో జేసీ బ్ర‌ద‌ర్స్ అరాచ‌కాల‌కు ఎదురొడ్డి నిలిచిన ప‌సుపులేటి ప‌ద్మావ‌తి లాంటి నాయ‌కులు త‌న‌కు ప‌ది మంది వుంటే చాల‌ని ఒక సందర్భంలో ప‌వ‌న్‌క‌ల్యాణే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అలాంటి మ‌హిళా నాయ‌కురాలు కూడా ప‌వ‌న్ రాజ‌కీయ వైఖ‌రి, అలాగే ఆయ‌న చుట్టూ వుండే నాదెండ్ల మ‌నోహ‌ర్‌, రుక్మిణి కోట తీరుతో విసుగు చెంది పార్టీని వీడ‌డం జ‌న‌సేన‌లో ఒక కుదుపే అని చెప్పాలి.

కొన్ని రోజులుగా సందీప్ రాయ‌ల్ వివిధ చాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆయ‌నకు నీడ‌లా న‌డిచే రుక్మిణి కోట‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పిరికోడ‌ని, పైకి క‌నిపించేదానికి, ఆయ‌న చ‌ర్య‌ల‌కు ఎంతో తేడా వుంటుంద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షిగా త‌న‌కు ఎన్నో తెలుస‌ని సంచ‌ల‌న విష‌యాలు చెబుతూ, వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. సివిల్ స‌ర్వీసెస్ ఉద్యోగాల‌కు ప్రిపేర్ అవుతున్న త‌న‌కు ఉజ్వ‌ల భ‌విష్య‌త్ క‌ల్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి, చివ‌రికి ఏ కార‌ణం చెప్ప‌కుండానే రోడ్డున ప‌డేశార‌ని, చివ‌రికి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కూ ఇదే గ‌తి అని సందీప్ చెప్ప‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ప‌ద్మావ‌తి, ఆమె త‌న‌యుడు సందీప్ త్వ‌ర‌లో వైసీపీలో చేర‌నున్న‌ట్టు తెలిసింది. ఏపీ విద్యా స‌ల‌హాదారు, వైసీపీ నాయ‌కుడైన ఆలూరు సాంబ‌శివారెడ్డిని త‌ల్లీత‌న‌యుడు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. త్వ‌ర‌లో సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వాళ్లిద్ద‌రూ వైసీపీ కండువా క‌ప్పుకోనున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఇక వైసీపీలో చేరిన మ‌రుక్ష‌ణం నుంచి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై త‌ల్లీత‌న‌యుడు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డే అవ‌కాశం వుంది. జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌తంగా ఏం జ‌రుగుతున్న‌దో వారు స‌మాజానికి చెప్పే అవ‌కాశం వుంది.