పవన్ గెలిపించింది గుర్తు లేదా బండారూ…!

అన్నదమ్ములు ఇద్దరు వల్ల ఓడామని తెగ వాపోతున్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి రిటార్ట్ ఇచ్చారు జనసేన నేతలు. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన గెడ్డం బుజ్జి అయితే…

అన్నదమ్ములు ఇద్దరు వల్ల ఓడామని తెగ వాపోతున్న టీడీపీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి గట్టి రిటార్ట్ ఇచ్చారు జనసేన నేతలు. ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన గెడ్డం బుజ్జి అయితే బండారు మీద మండిపడ్డారు. 2009, 2019ని మాత్రమే చెప్పి ఊరుకున్నా రెండుకు, మధ్యలో 2014ని మరచిపోతే ఎలా బండారు గారూ అని ఫైర్ అయ్యారు.

ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే జనసేన మద్దతుతోనే కదా అని ఆయన నిలదీశారు. పవన్ కళ్యాణ్ చిరంజీవి ఓడించారు అని విమర్శలు చేయడం కాదు 2024లో ముందు ఎలా గెలుస్తారో చూసుకోవాలని కూడా సవాల్ చేశారు.

గెలిచినపుడు తన ప్రతిభ అని ఓడితే చిరు కుటుంబానిదేనని చెప్పడం టీడీపీ నేతలకు తగునా అని ప్రశ్నించారు. జనసేన బీజేపీ మద్దతు తీసుకుని పోటీ చేసిన టీడీపీని జనాలు ఆదరించారని అన్నారు. గతంలో చేసిన మేలు మరచిపోతే ఎలా అంటూ మండిపడ్డారు.

మంత్రులుగా చేసిన వారు, టీడీపీలో సీనియర్లు మెగా ఫ్యామిలీ వల్లనే ఓటములు అని చెప్పడం మీద జనసైనికులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇదేనా మీ విధానం అని కూడా నిగ్గదీస్తున్నారు. ఈసారి పాయకరావు పేట నుంచి తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు  అనిత ఎలా గెలుస్తుందో చూస్తామని గెడ్డం బుజ్జి హెచరించడం విశేషం. బండారు మాటలు కాదు కానీ అనిత గెలుపుని మాత్రం డౌట్లో పడేశారు అని ఆమె వర్గీయులు ఆవేదన చెందుతున్నారు.