జేసీ సోద‌రులు నిద్ర‌లేకుండా గ‌డుపుతున్నారా!

చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు కేతిరెడ్డి, జేసీ ల మ‌ధ్య‌న మాట‌ల తూటాలు పేలుతున్నాయి! తాడిప‌త్రి, ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో కేంద్రీకృతం అయిన కేతిరెడ్డి కుటుంబీకులు, ఇప్పుడు తాడిప‌త్రికి మాత్ర‌మే ప‌రిమితం అయిన జేసీ ల‌పై ఒంటి కాలితో…

చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు కేతిరెడ్డి, జేసీ ల మ‌ధ్య‌న మాట‌ల తూటాలు పేలుతున్నాయి! తాడిప‌త్రి, ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో కేంద్రీకృతం అయిన కేతిరెడ్డి కుటుంబీకులు, ఇప్పుడు తాడిప‌త్రికి మాత్ర‌మే ప‌రిమితం అయిన జేసీ ల‌పై ఒంటి కాలితో లేస్తున్నారు! వీరి మ‌ధ్య రాజ‌కీయ వైరం ఈనాటిదేమీ కాదు. ద‌శాబ్దాల నుంచి ఇది ఉంది. ఒకే పార్టీలో ఉన్నా.. అంతా కాంగ్రెస్సే అయినా వీరి మ‌ధ్య‌న రాజ‌కీయ వైరానికి అయితే కొద‌వ‌లేదు.

వైఎస్ గ్రూప్ లో కేతిరెడ్డి సూర్య‌ప్ర‌తాప‌రెడ్డి కాంగ్రెస్ లో మ‌నుగ‌డ సాగించారు. అయితే ఆయ‌న ఒక ద‌శ‌లో కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ల‌డం తో వైఎస్ కూడా బాధ‌ప‌డిన‌ట్టున్నారు. అదే స‌మ‌యంలో కేతిరెడ్డి సూర్య‌ప్ర‌తాప‌రెడ్డి హ‌త్య జ‌రిగింది.

పాత రాజ‌కీయ వైరాల‌తో జ‌రిగిన‌, ఆ ఫ్యాక్ష‌న్ హ‌త్య‌ను రాజ‌కీయం చేసుకోవ‌డానికి తెలుగుదేశం పార్టీ నేత‌లు హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరే స‌మ‌యానికే స్థానికంగా ప‌రిస్థితి మారిపోయింది. కేతిరెడ్డి సూర్య‌ప్ర‌తాప‌రెడ్డి మ‌ర‌ణించిన కొద్ది సేప‌టికే ఆయ‌న భార్య‌, కొడుకులు తమ‌కు వైఎస్సే అండ అని ప్ర‌క‌టించేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చంద్ర‌బాబుకు అప్ప‌ట్లో రాజ‌కీయానికి అవ‌కాశం ద‌క్క‌లేదు.

అయితే కేతిరెడ్డి ఫ్యామిలీకి కాంగ్రెస్ లో పూల బాట ఉండేది కాదేమో, అయితే వైఎస్ శ‌క్తి వారికి రాజ‌కీయంగా మ‌ళ్లీ ప్రాణం పోసింది. కేతిరెడ్డి సూర్య‌ప్ర‌తాప‌రెడ్డి త‌న‌యుడు వెంక‌ట్రామిరెడ్డిని ధ‌ర్మ‌వ‌రం ఇన్ చార్జి అయ్యారు. అయితే జేసీ వ‌ర్గంతో కేతిరెడ్డి వైరం కొన‌సాగింది. అది గ‌త ఎన్నిక‌ల‌తో మ‌రింత ప‌తాక స్థాయికి చేరింది.

2019 ఎన్నిక‌ల్లో కేతిరెడ్డి సూర్య‌ప్ర‌తాప‌రెడ్డి సోద‌రుడు పెద్దారెడ్డిని జ‌గ‌న్ తాడిప‌త్రి నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దించారు. అప్ప‌టికే తాడిప‌త్రి ప‌రిధిలో వీరి రాజ‌కీయ ఉనికి పెద్ద‌గా లేక‌పోయినా… పార్టీ బేస్ మెంట్, గ‌ట్టిగా వీచిన జ‌గ‌న్ గాలిలో.. జేసీల కంచుకోట‌ను బ‌ద్ధ‌లు కొట్టి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు. మ‌రి వర్త‌మానంలోకి వ‌స్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడిప‌త్రిలో ర‌స‌వ‌త్త‌ర పోరు ఉంటుంద‌ని స్ప‌ష్టం అవుతోంది.

ఎవ‌రు గెలుస్తార‌నేదానికంటే.. హోరాహోరా రాజ‌కీయం ఉండే నియోజ‌క‌వ‌ర్గం ఇది. ఇప్పుడు తాడిప‌త్రి రాజ‌కీయంపై కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి హాట్ కామెంట్స్ చేస్తూ మ‌రింత వేడి ర‌గులుస్తున్నారు. ధ‌ర్మ‌వ‌రం రాజ‌కీయానికి ప‌రిమితం కాకుండా, త‌న బాబాయ్ త‌ర‌ఫున తాడిప‌త్రి రాజ‌కీయంపై వాడీవేడీ కామెంట్స్ చేస్తున్నారు వెంక‌ట్రామిరెడ్డి.

జేసీ సోద‌రుల‌కు నిద్ర‌లేని రాత్రులివి అంటూ కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి ఫైర్ అయ్యారు. కొడుకులు ప‌నికిరాకుండా పోవ‌డం, ఎమ్మెల్యే, ఎంపీలుగా నెగ్గ‌లేక‌పోవ‌డం.. ఇవ‌న్నీ క‌లిసి జేసీ సోద‌రుల‌కు నిద్ర‌లేకుండా చేస్తున్నాయని వెంక‌ట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. రాజ‌కీయంగా తాము ఓడ‌టం క‌న్నా.. త‌మ త‌న‌యులు నిల‌దొక్కుకోలేక‌పోవ‌డం ఈ వ‌య‌సులో నిజంగానే జేసీ సోద‌రుల‌కు స‌యించే విష‌యం కాక‌పోవ‌చ్చు! ఈ విష‌యంలోనే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి జేసీ సోద‌రుల‌ను దెప్పి పొడిచారు. మీ త‌న‌యులు రాజకీయంగా తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యారు అంటూ జేసీ సోద‌రుల‌కు అస‌హ‌నం క‌లిగించే కామెంట్లు చేశారు వెంక‌ట్రామిరెడ్డి.

ఇది వ‌ర‌కే ఈ ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యేపై.. *ధ‌ర్మార‌మోడు..* అంటూ ప‌లుసార్లు ప్ర‌భాక‌ర్ రెడ్డి కామెంట్లు విసిరారు. అప్పుడు పెద్ద‌గా స్పందించ‌ని వెంక‌ట్రామిరెడ్డి ఈసారి ప్ర‌భాక‌ర్ రెడ్డిపై ప‌దునైనా కామెంట్లే చేశారు.  మ‌రి పెద్ద నోళ్ల‌నే క‌లిగి ఉన్న జేసీ సోద‌రులు కామెంట్లు త‌మ త‌న‌యుల విష‌యంలో వ‌చ్చేసారికే అంత గ‌ట్టిగా స్పందించ‌లేక‌పోతున్న‌ట్టుగా ఉన్నారు!