జనసేనాని పవన్కల్యాణ్పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెలరేగిపోయారు. వారాహియాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ, పవన్కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పవన్కు కౌంటర్ ఇచ్చేందుకు ద్వారంపూడి మీడియా ముందుకొచ్చారు.
కొందరు మిత్రులు తనకు ఫోన్ చేసి పవన్ పర్సనల్ విషయాలపై మాట్లాడొద్దని సూచించారన్నారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్, రేణుదేశాయ్ తదితరుల గురించి చెప్పారన్నారు. పూనమ్ కౌర్ నోరు తెరుస్తానని అంటున్నారని ఆయన గుర్తు చేశారు. పవన్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డం వృథా అని సూచించడం వల్లే వాటి జోలికి వెళ్లడం లేదన్నారు. రాజకీయ వ్యభిచారి పవన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకే మీడియా ముందుకొచ్చానన్నారు. ఎవరిని ఉద్దరించడానికి జనసేన పెట్టారని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు బాగోగులు చూడానికి పార్టీ పెట్టాడా? పార్టీ స్థాపించినప్పుడు నీ వెనకాల ఉన్న నాయకులెవరూ, ఇప్పుడు లేరని గుర్తు చేశారు. నీది, నీ పార్టీ పరిస్థితి అది అని పవన్ను దెప్పి పొడిచారు. రాజు రవి తేజ అనే వ్యక్తితో కలిసి పుస్తకం రాశాడని, ఆయన బయటికొచ్చి తీవ్రంగా విమర్శించాడన్నారు. కానీ 30 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న తన వెంట, మొదటి నుంచి ప్రయాణిస్తున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారని చెప్పుకొచ్చారు.
వంగవీటి మోహన్రంగా కోసం కాకినాడలో మీటింగ్ నిర్వహించానన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రథమ శిష్యుడిగా రాజకీయాలు చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తే రెండుసార్లు గెలిచానని, పవన్ రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయాడని విమర్శించారు. సినిమా హీరో అయితే కావచ్చని, కానీ పొలిటికల్గా పవన్ జీరో అని చురకలు అంటించారు. తనను విమర్శించేస్థాయి కూడా లేదన్నారు.
పవన్ సార్కు బేరం కుదరకపోవడం వల్లే రోడ్డు మీదకి రావడం మొదలు పెట్టాడని చురకలు అంటించారు. మార్చి 14న సీఎం సీటు అడగలేనని చెప్పి, జూన్ 14కు వచ్చే సరికి మళ్లీ సీఎం అవుతానంటూ మాట మార్చడం వెనుక కేవలం ప్యాకేజీ కుదరక పోవడమే కారణమని ఆయన అన్నారు. రోజుకో మాట మాట్లాడితే నమ్మడానికి ప్రజలు ఏమైనా వెర్రి వాళ్లు అనుకుంటున్నావా? అని నిలదీశారు.
అరె పిచ్చోడా…నీకు చెప్పేది ఒక్కటే అని పవన్ను ఉద్దేశించి ఆయన అన్నారు. తాను మూడు సార్లు పోటీ చేస్తే రెండుసార్లు ప్రజలు గెలిపించారన్నారు. రౌడీని, గూండాని, కబ్జాదారుడిని అయితే ఎందుకు గెలిపిస్తారు? అని అడిగారు. సామాజిక పరంగా కాకినాడులో ఏ బలం లేని వాడినన్నారు. కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా తనను గెలిపించుకుంటున్నాయన్నారు. అది తన హీరోయిజం అని గర్వంగా చెప్పారు. కాకినాడలో తనను ఓడించడం నీ వల్ల కాదన్నారు. కాకినాడలో బేడీలు వేసి, కొట్టేస్తానంటే…అలాంటివి సినిమాలో చేసుకో అని హితవు పలికారు.
పరిటాల రవి గుండు కొట్టించాడని అన్నారు. తుపాకి పట్టుకుని తిరుగుతున్నావని నీకు కూతురు వరుసయ్యే అమ్మాయి ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కావాలనే నీ కోరిక తీరేది ఒకే ఒక్క చోట అన్నారు. అది సినిమాలో అని ఆయన వెటకరించారు. 175 నియోజకవర్గాలో నువ్వు అభ్యర్థుల్ని నిలబెట్టినట్టు, అందరూ గెలిచినట్టు, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినట్టు సినిమా తీసుకోవాలని హితవు చెప్పారు. సినిమాల్లో తప్ప, రియల్గా నీ బుద్ధి ఏంటో ప్రజలకు బాగా తెలుసు అన్నారు. పూర్తిగా ప్యాకేజీ స్టార్ అని తెలుసన్నారు.
బియ్యం అక్రమ రవాణా ద్వారా రూ.15 వేలు సంపాదించానని పవన్ అన్నారని, అందులో నిజం లేదన్నారు. తన దగ్గర అంత సొమ్ము వుంటే… పవన్కు ప్యాకేజీ ఇచ్చి తానే కొనే వాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చిపిచ్చిగా వాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. వివరాలు తెప్పించుకుని మాట్లాడాలని కోరారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నారు. బాబు రాజకీయాల్లోకి లేకపోతే పవన్ దుకాణం కూడా బంద్ అన్నారు. తనను డి బ్యాచ్ అన్న పవన్పై ద్వారంపూడి చెలరేగిపోయారు. పవన్ది ప్యాకేజీ బ్యాచా, పచ్చిబూతుల పవన్ బ్యాచా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు చెప్పారు. నువ్వు మాటలు మాట్లాడ్తావు, తాము చేతల్లో చూపుతామన్నారు.
బేడీలు వేసి వీధివీధిలో తిప్పుతూ కొడ్తానని తన హెచ్చరించాడని, అది జన్మలో చేయలేవన్నారు. అదేదో తానే చేస్తానన్నారు. నీ సంగతేంటో చూస్తా అని పవన్ను హెచ్చరించారు. దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని పవన్కు సవాల్ విసిరారు. తుక్కుతుక్కగా ఓడించకపోతే తాను చంద్రశేఖరరెడ్డినే కాదన్నారు. రా తేల్చుకుందాం అని సవాల్ విసిరారు.