అయ్యన్నపాత్రుడు మీద మళ్లీ కేసా…?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల గన్నవరం వెళ్లారు. నారా లోకేష్ సభలో ఆయన హద్దులు మరచి మాట్లాడారని వైసీపీ నేతలు పోలీసు కేసు పెట్టారు. ఇంతకీ అయ్యన్నపాత్రుడు ఏమి…

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల గన్నవరం వెళ్లారు. నారా లోకేష్ సభలో ఆయన హద్దులు మరచి మాట్లాడారని వైసీపీ నేతలు పోలీసు కేసు పెట్టారు. ఇంతకీ అయ్యన్నపాత్రుడు ఏమి మాట్లాడారూ అంటే అంబంటి రాంబాబుని పట్టుకుని అరగంట అంటూ సెటైర్లు వేశారు.

విశాఖ జిల్లా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని గంట చాలు అంటూ ఎకసెక్కమాడారు, మంత్రి రోజా మీద అయితే మహిళ అన్నది చూడకుండా దారుణంగానే మాట్లాడారు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద నోరు పారేసుకున్నారు.

అయ్యన్న భాష మాటల మీద వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్న ఈ సీనియర్ నేత వేదిక మీద ఇలా మాట్లాడుతారా అంటూ ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. గన్నవరంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన దుర్భాష మీద మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతకు ముందు గుంటూరు వెళ్ళి ఏకంగా ముఖ్యమంత్రి మీద నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడి మీద కేసులు ఉన్నాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. సీనియర్ నేతగా హుందాగా ఉండాల్సిన అయ్యన్న ఇలా తన వాచాలత్వంతో కేసులు పెట్టించుకోవడమే గొప్ప అనుకుంటున్నారని విమర్శించారు.

మా లోకేష్ అంటూ చంద్రబాబు వారసుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం విశాఖ నుంచి కృష్ణా జిల్లా దాకా వెళ్ళిన అయ్యన్నకు చినబాబు కరుణా కటాక్ష వీక్షణాలు ఎంతవరకూ ప్రసరిస్తాయో తెలియదు కానీ అతి ఉత్సాహంతో అన్న మాటలకు మాత్రం కేసులు పడుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.